విశాఖ ఫార్మా సిటీలోని అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి విధులకు వెళ్లి, తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుర్తి గ్రామానికి చెందిన ఆర్.సూర్యనారాయణ(40) అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి గాజువాకలో నివాసముంటూ విధులకు హాజరవుతున్నాడు. మంగళవారం జనరల్ షిఫ్ట్ విధులకు హాజరైన ఇతను సాయంత్రం ఐదు గంటల సమయంలో భార్యకు ఫోన్ చేసి, ఇంటికి బయలుదేరుతున్నట్టు చెప్పాడు. కానీ రాత్రి ఏడు గంటలు దాటినా సూర్యనారాయణ ఇంటికి చేరుకోలేదు. భార్య ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో ఆమె పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులకు ఫోన్ చేసి వాకబు చేయగా, కంపెనీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. కానీ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సూర్యనారాయణ భార్య, కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు. సూర్యనారాయణ విధులకు హాజరైనట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది. కానీ డ్యూటీ అనంతరం బయటకు వెళ్లినట్టు ఎక్కడా రికార్డు కాలేదు. ఇతని ద్విచక్ర వాహనం పార్కింగ్ స్థలంలోనే ఉంది. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు... సూర్యనారాయణ ఏమయ్యాడంటూ కంపెనీ ప్రతినిధులను నిలదీశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ భార్య బాల మాట్లాడుతూ, డ్యూటీ ముగిసిన తరువాత తన భర్త ఇంటికి రాలేదని, పరిశ్రమలో అడిగితే ఇంటికి వెళ్లిపోయాడని చె బుతున్నారని, లోపల ఏదో ప్రమాదం జరిగి ఉండొచ్చనని, ఆ విషయాన్ని యాజమాన్యం దాచిపెడుతున్నదని ఆరోపించారు. తన భర్తకు ఏదైనా హానీ జరిగితే యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa