ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఊరట.. ఒకేసారి ఏడాది జీతం అకౌంట్‌లలో జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 07:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది కాలంగా జీతాలు లేక ఇబ్బందిపడుతున్నఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని తెలియజేశారు.. జీవోను ట్వీట్ చేశారు. గత ఐదేళ్లలో జగన్ సర్కార్ ఉన్నత విద్యా వ్యవవస్థను నిర్వీర్ చేసిందని లోకేష్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ‘గత 5 ఏళ్లలో జగన్ సర్కారు నిర్వీర్యం చేసిన ఉన్నత విద్యా రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కుప్పం ద్రవిడ యూనివర్శిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారు. ఈ విషయాన్ని అక్కడి ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు రూ.2.86 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది’ అని ట్వీట్ చేశారు.


మరోవైపు స్కూళ్లలో హాజరుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి స్కూల్లోని తరగతి గదిలో విద్యార్థుల హాజరును బోర్డుపై నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ తరగతి గదుల్లో కచ్చితంగా బ్లాక్‌ బోర్డుపై కుడివైపున మొత్తం ఎంతమంది విద్యార్థులు? ఎంతమంది హాజరయ్యారు? ఎంతమంది గైర్హాజరు అయ్యారు? అనేది నమోదు చేయాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లతో పాటుగా అన్ని యాజమాన్యాలు దీన్ని అనుసరించాలని ఆదేశించారు.


అలాగే రాష్ట్రంలో సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎస్సెస్సీ బోర్డుకు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ పాఠశాలల్లో విద్యార్థులు ఆ బోర్డు పరీక్షలకు సన్నద్ధంగా లేరని.. విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు టీచర్లకు సరైన శిక్షణ లేదంటోంది ప్రభుత్వం. సీబీఎస్‌ఈకి తగిన విధంగా ప్రిపరేషన్ లేనందున ఫైనల్ పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులకు ఇబ్బందిపడే అవకాశం ఉందని.. అభిప్రాయపడ్డారు.


మరోవైపు ఇటీవల ఆయాలు, వాచ్‌మెన్ల పెండింగ్ జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది. గత ప్రభుత్వం ఈ జీతాలు పెండింగ్ పెట్టగా.. తాజాగా జీతాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెండింగ్ జీతాల గురించి తెలియడంతో మంత్రి లోకేష్ వెంటనే స్పందించి.. బకాయిలను విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలకు రూ.64.38 కోట్లు, అలాగే టాయిలెట్ల క్లీనింగ్‌ మెటీరియల్ బకాయిలు రూ.25.52 కోట్లు చొప్పున మొత్తంగా రూ.89.9 కోట్ల బకాయిలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa