ఏపీలోని వరద బాధితులకు కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన నేత, నటుడు హైపర్ ఆది తన వంతు సాయం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి రూ.3 లక్షలు విరాళం తాలూకు చెక్ అందజేశారు. ఈ విరాళాన్ని వర్షాల కారణంగా నష్టపోయిన గ్రామ పంచాయతీలకు వినియోగించాలని హైపర్ ఆది పవన్ కళ్యాణ్ను కోరారు.
ఈ మూడు లక్షల రూపాయలలో పిఠాపురం నియోజకవర్గంలోని ఎ.కె. మల్లవరం పంచాయతీకి లక్ష.. తన సొంతూరైన ప్రకాశం జిల్లాలోని పల్లామల్లి గ్రామ పంచాయతీకి రూ.2 లక్షలు అందించాలని హైపర్ ఆది కోరారు. వరద కారణంగా నష్టపోయిన తెలుగు ప్రజల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంతంగా రూ. 6 కోట్లు విరాళం అందించారన్న హైపర్ ఆది.. ఆయన స్ఫూర్తితోనే తానూ విరాళం ఇచ్చినట్లు చెప్పారు. పంచాయతీలకు నేరుగా విరాళం ఇవ్వవచ్చనే సంగతి తెలిసి మూడు లక్షలు విరాళంగా అందించినట్లు చెప్పారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన హైపర్ ఆది.. ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. అనంతరం జనసేన పార్టీ తరుఫున ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం తీవ్రంగా కృషిచేశారు. తాజాగా ఆయన స్ఫూర్తితోనే వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామ పంచాయతీలకు మూడు లక్షల రూపాయలు విరాళంగా అందించారు.
మరోవైపు వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు గానూ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు వస్తూనే ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ ప్రతినిధులు రూ.67,29,398 చెక్కును క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ చేతికి అందజేశారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇక రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. అలాగే రాజానగరం నియోజకవర్గ ప్రజలు రూ.4.82 లక్షలను విరాళం సహాయ నిధికి ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa