పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా. ఇప్పుడు దేశం మొత్తం ఇదే విషయం చర్చించుకుంటోంది. అయితే గత కొన్నేళ్లుగా జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్లను కూడా తీసుకురావాలని.. డిమాండ్లు వినిపిస్తున్నా కేంద్రం పేరు చెప్పి రాష్ట్రాలు.. రాష్ట్రాల పేరు చెప్పి కేంద్రం తప్పించుకుంటోంది. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. వాటి ధరలు భారీగా తగ్గి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో భారీగా కోత పడుతుంది. అందుకే ఈ డిమాండ్ ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంలో ఏకభిప్రాయం సాధించాలని రాష్ట్రాలకు సూచించారు.
మహారాష్ట్రలోని పూణే ఇంటర్నేషనల్ సెంటర్ 14వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ.. వచ్చే 10 ఏళ్లలో భారత ఇంధన భద్రతను పెంపొందించడానికి వ్యూహాలు, చర్యలు అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎంతో కాలంగా ఒక డిమాండ్ అయితే ఉందని పేర్కొన్న హర్దీప్ సింగ్ పూరీ.. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పలుమార్లు ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు చేరిందని తెలిపిన హర్దీప్ సింగ్ పూరీ.. ఈ క్రమంలోనే ఇంధనం వాడకం కూడా 3 రెట్లు అధికం అయిందని వెల్లడించారు.
ఇక వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే 25 శాతం ఇంధనాన్ని భారత్ వినియోగించనుందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వివరించారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని హర్దీప్ సింగ్ పూరీ గుర్తు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అయితే పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని గతంలోనే కేరళ హైకోర్టు స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. కానీ జీఎస్టీ సమావేశంలో చర్చించేందుకు కేరళ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్ను వదులుకోవడానికి దేశంలోని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు సిద్ధంగా లేవని తెలిపారు. మరీ ముఖ్యంగా రాష్ట్రాలకు మద్యం, పెట్రోల్, డీజిల్ వంటివి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయని హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. అలాంటి సమయంలో ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు పలు రాష్ట్రాలు సంసిద్ధత వ్యక్తం చేయకపోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa