వివిధ ప్రభుత్వ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలనూ గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవల రంగాల్లో వృద్ధిపై గురువారమిక్కడి సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలూ తిరోగమనంలోకి వెళ్లాయని.. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని తెలిపారు.
ఇప్పుడు ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకొస్తున్నామని.. వీటిని సమర్థంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు వారిపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలని పేర్కొన్నారు. ‘వ్యవసాయం రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదు. ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యం. 2014 తర్వాత రాష్ట్ర విభజన కష్టాలు ఉన్నా.. నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7 శాతం వృద్ధి రేటు సాధించింది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ నిర్ణయాలతో వృద్థి రేటు 10.59 శాతానికి తగ్గింది. 2019లో తెలంగాణతో మన జీఎ్సడీపీ వ్యత్యాసం కేవలం 0.20 శాతం ఉండేది. అది 2024కి 1.5 శాతానికి పెరిగింది. 2014-15 మధ్య మన రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.93,903 ఉండగా.. నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో 2019 నాటికి రూ.1,54,031కి పెరిగింది.
తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్థి 13.21 శాతం ఉండగా.. గత ప్రభుత్వంలో అది 9.06 శాతమే. తలసరి ఆదాయంలో వృద్థి పడిపోయి.. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. నాడు తెలంగాణకు, మనకు మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం కేవలం 0.16 శాతం ఉంటే.. గత ప్రభుత్వంలో అది 1.84 శాతానికి పెరిగింది. దక్షిణాది రాష్ర్టాల్లో తలసరి ఆదాయంలో ఆంధ్ర 5వ స్థానంలో ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ శాఖలు విజన్ సిద్థం చేసుకుని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలి’ అని నిర్దేశించారు. కొన్ని శాఖలు బాగా వెనుకబడి ఉన్నాయని.. అవి క్రియాశీలం కావాలన్నారు.
ఆయా రంగాల్లో లక్ష్యాలపై ప్రణాళికలతో రావాలని అధికారులను ఆదేశించారు. జనవరిలో పీ-4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్, పార్ట్నర్షిప్) విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నామని, దీని ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు.. ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10 శాతం మందిని పైకి తెచ్చేందుకు సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు.. సంపన్నులు, సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్సఆర్) ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి, వారికి అవకాశాలు కల్పించడానికి సలహాదారుగా దోహదపడాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa