భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు కోసం లావోస్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి.. కెనడా ప్రధాని జస్టిన్ టూడోతో భేటీ అయ్యారు. తదుపరి చేయాల్సిన పనులు ఉన్నాయని మోదీతో ట్రూడో చెప్పినట్టు ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కెనడా మీడియా కథనాలు ప్రచురించింది. అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. భారత-వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై కఠినమైన, ధ్రువీకరించిన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే కెనడాతో సంబంధాల పునరుద్దరణ జరుగుతుందని స్పష్టం చేశాయి. వియత్నాంలో కెనడా, భారత ప్రధానుల మధ్య జరిగిన భేటీలో ఎటువంటి వాస్తవిక చర్చలు జరగలేదని పేర్కొన్నాయి.
‘కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీలో వాస్తవిక అంశాలు చర్చకు రాలేదు.. కెనడా గడ్డపై భారత వ్యతిరేక ఖలిస్థానీ కార్యకలాపాలు జరగడానికి అనుమతించబోరని, కెనడా భూభాగం నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని సమర్థించే వారిపై ఇప్పటివరకు లేని గట్టి చర్యలు తీసుకుంటామని భారత్ ఆశిస్తోంది’ అని అన్నాయి.
‘కెనడాతో సంబంధాలకు భారత్ ప్రాముఖ్యతనిస్తుంది.. అయితే భారత్పై కెనడాలో ద్వేషం, తప్పుడు సమాచారం, మత సామరస్యం, హింసను ప్రోత్సహించడానికి కుట్రలు, భారత వ్యతిరేక కార్యకలాపాలను చురుకుగా కొనసాగించే వారిపై కెనడా ప్రభుత్వం కఠినమైన, ధ్రువీకరించదగిన చర్యలు తీసుకుంటే తప్ప, ఇరు దేశాల మధ్య సంబంధాలను సరిదిద్దలేం’ అని స్పష్టం చేశాయి.
దీనికి ముందు మోదీతో భేటీ అనంతరం కెనడా ప్రధాని ట్రూడో మాట్లాడుతూ.. ‘భారత్- ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించా. తదుపరి మనం చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పా.. వివరాల్లోకి వెళ్లను కానీ.. నేను ఎప్పుడూ చెబుతున్నట్లుగా కెనడా పౌరుల భద్రత, చట్టబద్ధపాలనే మా ప్రభుత్వ బాధ్యతలు. వాటిపైనే దృష్టి సారించా’ అని ట్రూడో అన్నట్టు కెనడా మీడియా వెల్లడించింది. కాగా, భారత్-కెనడాల మధ్య ఖలీస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అగ్గి రాజేసింది. ఈ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందనడానికి తమ వద్ద సమాచారం ఉందని సాక్షాత్తు కెనడా పార్లమెంట్లోనే ట్రూడో చేసిన ఆరోపణలతో కలకలం రేగింది.
ఇది ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది. భారత సీనియర్ దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడంతో న్యూఢిల్లీ తీవ్రంగా స్పందించింది. కెనడాకు చెందిన 40 మంది దౌత్య సిబ్బందిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అయితే, మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట్లాడిన ట్రూడో.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa