స్వలాభం కోసమే వైయస్ జగన్పై వాసిరెడ్డి పద్మ విమర్శలు చేస్తున్నారంటూ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. జగనన్న కార్యకర్తలను సరిగా చూసుకోకపోతే మహిళా చైర్మన్ పదవి ఆమెకు ఎలా వచ్చింది? అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలకు వైయస్ జగన్ అగ్రస్థానం కల్పించారన్నారు. వ్యక్తిగత స్వార్థంతో వాసిరెడ్డి పద్మ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదుకళ్యాణి మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్ హోదాతో మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా పని చేసిన వాసిరెడ్డి పద్మ.. ఇటీవల ఒక నియోజకవర్గాన్ని అడిగారని, అది ప్రస్తుతానికి వీలు కాదని చెప్పడంతో, ఆమె పార్టీని వీడారని ఎమ్మెల్సీ చెప్పారు.
రాజకీయాలు చేయడానికి మహిళలే దొరికారా? అని వాసిరెడ్డి పద్మ అంటున్నారన్న వరుదు కళ్యాణి, కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే వారి పక్షాన నిలబడి న్యాయం చేయాలని చూడటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజకీయం చేయడమా? బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం రాజకీయమా?. అని నిలదీశారు. ‘మీ సొంత రాజకీయ ఎజెండాతో జగన్ గారిపై బురద జల్లడం ఎంత వరకు సమంజసం?. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్ద పదవులు అనుభవించిన మీరు నైతిక విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదం’ అని చురకలంటించారు. దిశ గురించి గతంలో మాటలకు, ఇప్పటి మాటలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూసుకోవాలని, ఎవరి ప్రోద్భలంతో విమర్శలు చేస్తున్నారో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని, స్వలాభం కోసం ఆత్మవంచన చేసుకోవద్దని హితవు చెప్పారు. మహిళల రక్షణ, భద్రత కోసం ఇంతగా పోరాడుతున్న జగన్గారిపై బురద చల్లడం సమంజసం కాదని, దాన్ని ఎవ్వరూ హర్షించరని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa