ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారికి.. లైసెన్స్ తీసుకునేవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లెసెన్సు తీసుకునేవారికి అందించే డీఎల్ కార్డులు మళ్లీ జారీ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ స్మార్ట్ కార్డులను అందించే విధానాన్ని పక్కన పెట్టింది. ఈ మేరకు స్మార్ట్కార్డుల జారీకి సిద్ధమయ్యారు.. నవంబరు మొదటి వారం నుంచి వాహన్, సారథి పోర్టల్లో ఈ కార్డుల కోసం ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. దీని కోసం రూ.200 ఫీజుతోపాటు, స్పీడ్పోస్టు ఛార్జి రూ.35 ఆన్లైన్లోనే వసూలు చేస్తారు. స్మార్ట్కార్డుల సరఫరాకు టెండర్లు పిలిచేందుకు రవాణాశాఖ ఫైల్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే టెండర్లు పిలిచి, వెంటనే కాంట్రాక్టర్ను ఎంపిక చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 10 నుంచి 12 వేలు రిజస్ట్రేషన్, డీఎల్ కార్డుల చొప్పున నెలకు 3 లక్షలు ఉంటాయి. అలాగే ఏడాదికి దాదాపు 36 లక్షల కార్డులు అవసరమని అంచనా వేశారు.. గతంలో ఈ స్మార్ట్కార్డులను కాంట్రాక్టర్ సరఫరా చేసేవారు.. ఆ తర్వాత జిల్లా రవాణా శాఖ, ఆర్టీవో కార్యాలయాల్లో ఆ కార్డులపై వివరాలు ముద్రించి, వాహనదారుల ఇళ్లకు స్పీడ్ పోస్టులో పంపించేవారు. అప్పుడు కూడా రూ..200 ఫీజుతో పాటుగా స్పీడ్ పోస్ట్ ఛార్జీలు వసూలు చేశారు. స్మార్ట్ కార్డు, వివరాల ముద్రించేందుకు కొంత ఖర్చవుతుంది.. ప్రభుత్వానికి ఒక్కో కార్డుపై మరికొంత వరకు ఆదాయం వస్తుందనే లెక్కలు ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలో వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏడాదికి కూడా ఆర్సీ కార్డు యజమానికి చేరేది కాదనే విమర్శలు ఉన్నాయి. ఈ స్మార్ట్కార్డులు సరఫరా చేసిన కాంట్రాక్టర్కు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం రూ.కోట్లలో బకాయిలు పెట్టింది.. దీంతో కాంట్రాక్టర్ స్మార్ట్ కార్డుల సరఫరా నిలిపేశారు. రూ.200 ఫీజు చెల్లించినా సరే స్మార్ట్కార్డులు రాకపోవడంపై ఆర్డీవో కార్యాలయంలో వాహనదారులు అధికారుల్ని ప్రశ్నించారు. గతేడాది జుల్ నుంచి ఈ విధానాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఆర్సీతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ కాపీ వాహనదారుల వెంట ఉంచుకుంటే సరిపోతుందని చెప్పారు. కాకపోతే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ తనిఖీల సమయంలో ఆర్సీ, డీఎల్ కార్డులు లేకపోవడంతో కొంత ఇబ్బందిపడ్డారు. ఈ సమస్యల్ని గమనించిన చంద్రబాబు ప్రభుత్వ మళ్లీ స్మార్ట్ కార్డుల్ని జారీ చేసేందుకు సిద్ధమైంది. మళ్లీ స్మార్ట్ కార్డులు జారీ చేస్తే తమకు ఇబ్బందులు ఉండవని వాహనదారులు చెబుతున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఊరట లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa