ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు ఊరట దక్కింది. నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని ఆదేశించింది. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాల వైెఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా నంద్యాలలోకి ఆయన్ను తీసుకువచ్చారు. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులు లేవు.. అయినా సరే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా.. అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్పై శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డిలపై అప్పట్లో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసును క్వాష్ చేయాలంటూ అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ గత నెల 25న విచరాణ జరిగింది.. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసుపై ఇవాళ (నవంబరు 6) తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది. అల్లు అర్జున్పై కేసును క్వాష్ చేస్తూ తీర్పును వెల్లడించింది.
ఎన్నికల సమయంలో శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఒక వైపు దగ్గర బంధువు పవన్ కళ్యాణ్ ఇదే ఎన్నికల్లో పోటీ చేస్తుంటే.. ఆయనకి మద్దతు తెలపకుండా ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి చెందిన శిల్పా రవికి ప్రచారం కల్పించడమేంటని జనసేన వర్గం ప్రశ్నించింది. జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అప్పట్లో సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపారు. అంతేకాకుండా మెగా, అల్లు అభిమానులు సోషల్ మీడియాలో బండబూతులు తిట్టుకున్నారు. అయితే, దీనిపై అప్పట్లోనే బన్నీ క్లారిటీ ఇచ్చారు. రవి తనకు మిత్రుడని.. తనకు నచ్చిన వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు.
వాస్తవానికి శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. బన్నీ వైఫ్ స్నేహారెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. స్నేహారెడ్డి ద్వారా రవిచంద్ర కిశోర్ రెడ్డి బన్నీకి ఫ్రెండ్ అయ్యారు. వీళ్లిద్దరి అభిరుచులు కలవడంతో బాగా దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లోనూ శిల్పా రవికి అల్లు అర్జున్ తన మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో శిల్పా రవి నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి మాత్రం ఓడిపోయారు.
మరోవైపు అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పురోహితుల నుంచి వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి.. పట్టువస్త్రంతో సత్కరించారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే తిరుమలకు రాలేదు.. స్నేహారెడ్డి తన స్నేహితులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2 ది రూల్’లో రష్మిక హీరోయిన్. ఈ మూవీ డిసెంబరు 5న పాన్ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa