ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నియంత్రించలేక ఏపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా విమర్శించారు. అందులో భాగంగానే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు మూడు సింహాలకు సెల్యూట్ కొట్టి పనిచేయాలే కానీ.. కూటమిలోని మూడు పార్టీలకు కాదంటూ రోజా విమర్శించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఇంట్లోని వారే మహిళలా.. వైసీపీ నేతల ఇళ్లల్లో మహిళలు లేరా అని రోజా ప్రశ్నించారు. ఇదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి రోజా సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన పోస్టుల ఆధారంగా వైసీపీ వాళ్లపై కేసులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్.. నారా లోకేష్పైనా కేసులు పెట్టించాలని డిమాండ్ చేశారు.
"పవన్ కళ్యాణ్కు ఆడవాళ్ల మీద గౌరవం లేదు. జనసేన, టీడీపీ వాళ్లు పెట్టే పోస్టులు ఆపలేరు. హీరో ప్రభాస్ మీద మెగాఫ్యాన్స్, జనసైనికులు పెట్టిన ఘోరమైన పోస్టులను తప్పని ఎప్పుడైనా ఆపించారా? వారిపై కేసులు పెట్టించారా? అల్లు అర్జున్ మీద, ఆయన కుటుంబం మీద పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా దిగజారుడుతనంగా పోస్టులు పెట్టింది. దానిని ఆపారా..? లోకేష్ మా అమ్మను సోషల్ మీడియాలో నీచాతినీచంగా చిత్రీకరిస్తున్నాడని అప్పట్లో అన్నావుగా.. మరిప్పుడు లోకేష్ మీద కేసు పెట్టండి. హీరో ప్రభాస్, అల్లు అర్జున్ మీద పోస్టులు పెట్టిన వారిపైనా చర్యలు తీసుకోండి" అంటూ మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పోలీసులు, సీఎం, డిప్యూటీ సీఎం ఫెయిల్ అయ్యారన్న రోజా.. తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని అన్నారు. ఏపీలో పరిపాలన చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా అనే సందేహం వస్తోందన్నారు. హిట్లర్, గడాఫీ ఇద్దరు కలిసి కూర్చుని పాలిస్తే ఎలా ఉంటుందో , అలా ఏపీలో పాలన సాగుతోందంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నంలో సాక్షాత్తూ హోం మంత్రి వంగలపూడి అనిత ఇంటికి సమీపంలోనే గంజాయి సాగు చేస్తూ దొరికారన్న రోజా.. గంజాయి సాగును అరికట్టలేకపోయిన హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి కేసు పెట్టారన్న రోజా.. రవీందర్ రెడ్డి అరెస్ట్ను ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతున్న పోలీసులను వదిలేది లేదంటూ రోజా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa