ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానంలో స్టూడెంట్స్ టూర్.. పిల్లలను స్కూలుకు రప్పించేందుకు టీచర్ గొప్ప నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 10:41 PM

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అంటే వేళకు రారు.. వచ్చినా విద్యార్థులకు పాఠాలు సరిగా చెప్పరు.. అసలు స్టూడెంట్స్‌ను పట్టించుకోరు అనే మాట బాగా వినిపిస్తుంది. అయితే కొందరు గవర్నమెంట్ టీచర్లు చేసిన పనికి.. అందరికీ అదే పేరు వస్తోంది. కానీ ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కూడా చాలా మంచి వారు ఉంటారని.. వారు విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకుని.. వారికి చదువుతోపాటు సమాజంలో ఎలా ఉండాలో నేర్పించిన ఘటనలు మనం ఎన్నో చూశాం. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా తన సొంత డబ్బులతో విద్యార్థులను విమానం ఎక్కించారు. రోజూ స్టూడెంట్స్ స్కూలుకు రావాలని ఆయన తీసుకున్న నిర్ణయం.. ప్రస్తుతం అందర్నీ కదిలిస్తోంది.


కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని సొనట్టి ప్రభుత్వ సీనియర్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రకాష్ దెయన్నవర.. టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు.. తమ పిల్లలను చదివించాలని సరైన అవగాహన లేదని గుర్తించారు. అందుకే స్థానికులు రోజూ పిల్లలను స్కూలుకు పంపించడం లేదని గమనించారు. దీంతో ఆ స్కూలుకు విద్యార్థులు రాకపోవడంతో పాఠశాలల్లో పిల్లల హాజరు సంఖ్య తక్కువగా ఉందని తెలుసుకున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసి.. విద్యార్థులు నిత్యం స్కూలుకు వచ్చేలా వచ్చేలా చేయాలని ప్రకాష్ దెయన్నవర అనుకున్నారు. ఈ క్రమంలోనే స్కూలుకు క్రమం తప్పకుండా వచ్చిన వారిని తాను విమానంలో విహారయాత్రకు తీసుకెళ్తానని వారకి చెప్పారు.


ఈ ప్రకటన చేసిన తర్వాత పరిస్థితి మారింది. తాము కూడా విమానంలో వెళ్లాలని.. అక్కడి విద్యార్థులు నిత్యం పాఠశాలకు రావడం ప్రారంభించారు. క్రమంగా స్కూలు హాజరుశాతం కూడా పెరిగింది. ఈ క్రమంలోనే గత ఏడాది ఇచ్చిన మాటకు అనుగుణంగా పాఠశాలకు రెగ్యులర్‌గా వచ్చిన 17 మంది విద్యార్థులను ఎంపిక చేసిన టీచర్ ప్రకాష్ దెయన్నవర.. వారందరినీ గురువారం(నవంబర్ 7న) విమానం ఎక్కించారు. బెళగావిలోని సాంబ్రా ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు.. తన సొంత డబ్బులతో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సాంబ్రా ఎయిర్‌పోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు.. వారికి వీడ్కోలు పలికారు.


ఇక రెండు రోజుల పాటు విద్యార్థులంతా హైదరాబాద్‌లో సందర్శించారు. హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామోజీ ఫిలిం సిటీ, చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం సహా పలు ముఖ్యమైన ప్రాంతాలను ప్రకాష్ దెయన్నవర.. వారికి చూపించారు. ఈ విహారయాత్రకు మొత్తం దాదాపు రూ.2.5 లక్షలు ఖర్చు అవుతుందని ముందుగా అంచనా వేశారు. అందులో రూ.2 లక్షల వరకు ప్రకాష్ దెయన్నవర భరించారు. రూ.3 వేల చొప్పున విద్యార్థుల నుంచి వసూలు చేశారు.


అయితే విమానం ఎక్కడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విమానం గాల్లో ఎగరడం మాత్రమే చూశామని.. ఫ్లైట్ ఎక్కాలి అనేది తన కోరిక అని స్టూడెంట్స్ తెలిపారు. ప్రకాష్ సార్ వల్లే ఆ కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. ఇక తమ గ్రామంలో ఎవరూ విమానం ఎక్కలేదని.. తనకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని మరో విద్యార్థి తెలిపారు. అయితే ఈ టూర్ సక్సెస్ కావాలని ప్రకాష్ దేయన్నవర గత సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు. అయితే తన కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. విద్యార్థుల కోసం ఏకంగా రూ.2 లక్షలు ఖర్చు చేసి.. వారికి మరిచిపోలేని అనుభవాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa