దేశ ఐటీ రాజధాని.. ఉద్యాననగరి బెంగళూరులో ఇంటి అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరుకైన రహదారులు, ఆపై వాహనాల రద్దీ ఇవన్నీ వెరిసి ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించే ఉద్దేశంతో చాలా మంది కార్యాలయాలకు దగ్గర్లోనే ఇంటిని అద్దెకు తీసుకోడానికి మొగ్గుచూపుతారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇంటి యజమానులను అద్దెలను ఇష్టారీతిన పెంచేస్తుంటారు. అద్దె మాట అటుంచితే.... సెక్యూరిటీ డిపాజిట్ బెంబేలెత్తిస్తుంది. తాజాగా ఓ యువతికి అలాంటి అనుభవమే ఎదురైంది.
ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లిన హర్నిద్ కౌర్ అనే యువతి.. కొంతకాలంగా అక్కడ ఇంటిని అద్దె తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారీ అద్దెలు చూసి వెనకడుగేస్తున్నట్లు ఆమె చెప్పింది. ఓ అపార్ట్మెంట్లో గది అద్దెకు తీసుకోవడానికి వెళ్తే నెలకు రూ.40,000.. రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని సదరు యజమాని అడిగారని కౌర్ తెలిపింది. బెంగళూరు నగరంలో ఇలాంటి భారీ అద్దెలతో తాను విసుగెత్తిపోయానని ఎక్స్ (ట్విట్టర్)లో ఈ మేరకు ఆమె పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. తాము కూడా ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ‘బెంగళూరులో ఇప్పటికే అధిక అద్దెలతో ఇబ్బందులు పడుతున్నాం.. ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇంత పెంచేస్తే ఇక అంతే సంగతులు’ అంటూ ఒకరు..‘ఢిల్లీ వంటి నగరాల్లో గది అద్దెకు తీసుకున్నప్పుడు సెక్యూరిటీ డిపాజిట్గా ఒకటి లేదా రెండు నెలల అడ్వాన్స్ మాత్రమే తీసుకుంటారు. కానీ బెంగళూరులో 5, 10 నెలల మొత్తాన్ని డిపాజిట్గా తీసుకుంటున్నారు’ అంటూ ఇంకొకరు రాసుకొచ్చారు. ‘బెంగళూరులో ఇంటి యజమానులు దొంగలు.. ఖాళీ చేసిన సమయంలో చాలా ఇబ్బందులు పెడతారు’ అని ఇంకో నెటిజన్ మండిపడ్డారు.
‘అద్దెల విషయంలో ఢిల్లీ చాలా బెటర్.. ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.. ఫుడ్ బాగుంటుంది.. తక్కువ ట్రాఫిక్.. గాలి నాణ్యత మెరుగుపడితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది... శాంతిభద్రతలకు ముంబయి ఉత్తమం..బెంగళూరు విషయానికి వస్తే దారుణంగా ఉంటుంది’ అని మరో నెటిజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా వైరస్ తర్వాత ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగాయి. రెండేళ్ల కిందటతో పోలిస్తే అద్దెలు దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన నివాస మార్కెట్గా మారింది. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరులో ఇళ్ల యజమాను ఆదాయంలో అధిక భాగం అద్దెల నుంచే వస్తున్నట్టు పలు మార్కెట్ రీసెర్చ్ నివేదికలు వెల్లడించాయి. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, గోల్డ్మన్ శాక్స్, యాక్సెంచర్.. వంటి అంతర్జాతీయ స్థాయి టెక్ సంస్థలకు నిలయమైన ఈ నగరంలో దాదాపు 15 లక్షల మంది ఐటీ ఉద్యోగులు నివసిస్తున్నట్లు అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa