సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ వేయడంపై హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్పై హైకోర్ట్లో ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టనిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యలు చేసింది. పిల్కు సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇటీవల కాలంలో కొన్ని సోషల్ మీడియాల్లో కొంతమంది మహిళలను కూడా దూషిస్తూ పెట్టిన పోస్టులను హైకోర్టు ధర్మాసనం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ముందే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మాత్రం జడ్జిలపై కూడా పోస్టులు పెట్టారని, ఇలా అసభ్యకరంగా పోస్టులు పెడితే తామెలా నిలువరించగలమని నిలదీసింది. అదేవిధంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని పోలీసులు చట్టం ప్రకారం తప్పనిసరిగా వారిపై కేసులు నమోదు చేస్తారని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ హైకోర్టు బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వమని పునరుద్ఘాటించింది. ఈ విధంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడం క్షమార్హం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా.. సోషల్ మీడియా ఆక్టివిస్ట్లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ జమానాలో విజయబాబు కీలక పదవులు నిర్హించారు. అంతేకాదు గతంలో ఒక పత్రికకు ఎడిటర్గా కూడా విజయబాబు వ్యవహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa