రాత్రివేళల్లో ప్రజలు ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ప్రతి వీధిలోనూ పదుల సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోమవారం కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి చెందడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తుఫాన్ కాలనీలో అప్పటి వరకు ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని వీధికుక్కలు వెంటాడి కరిచి చంపేశాయి. బాలతోటి గోపాలరావు-నాగమణి దంపతులకు ఎనిమిదేళ్ల తర్వాత ప్రేమ్కుమార్ పుట్టాడు. ఒక్కగానొక్క సంతానం కావటంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. గోపాలరావు స్థానిక స్టేషన్ సెంటర్లో సెల్ఫోన్ మెకానిక్గా పనిచేస్తున్నాడు.
తల్లి నాగమణి వ్యవసాయ కూలీ. సోమవారం సాయంత్రం తల్లి ఇంట్లో ఉండగా, ప్రేమ్కుమార్ ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. అక్కడికి సమీపంలోనే గుంపులుగా ఉన్న వీధి కుక్కలు ప్రేమ్ కుమార్ను సమీపంలోని ఖాళీ స్థలంలోకి లాక్కెళ్లి దాడి చేశాయి. అంతలో తల్లి వచ్చి కుమారుడు కోసం వెతుకుతుండగా, కుక్కల దాడిలో గాయపడి ఉన్న ప్రేమ్కుమార్ను అటుగా వెళుతున్న చర్చి ఫాదర్ గమనించాడు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రేమ్కుమార్ను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించి పరిస్థితి విషయమించటంతో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమ్కుమార్ మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ప్రేమ్కుమార్ భౌతికకాయాన్ని చూసి భోరున విలపించారు. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎం.ఎ్స.కె.అర్జున్, వీఆర్వో చైతన్య వివరాలను నమోదు చేసుకున్నారు. బాలుడి మృతితో తుఫాన్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రేమ్కుమార్ భౌతికకాయానికి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మంగళవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు భౌతికకాయాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సందర్శించి నివాళులర్పించారు. ప్రేమ్కుమార్ భౌతిక కాయానికి కుటుంబసభ్యులు, బంధువులు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa