టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మతి భ్రమించి మాట్లాడారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఫైర్ అయ్యారు. శాసనమండలిలో బడ్జెట్పై మాజీ ఆర్థిక మంత్రి యనమల చేసిన ప్రసంగాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ..... యనమల రామకృష్ణుడుకి మతి భ్రమించి మాట్లాడారు. మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడే మాటలు ఇవేనా ? సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడానికే జగన్ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు పాలన కంటే జగన్ ప్రభుత్వం లోనే సమర్దవంతంగా పనిచేసింది. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, యనమల రామకృష్ణుడు మాటలు అర్థం పర్థం లేనివి.బడ్జెట్ పత్రాల్లో రాష్ట్రానికున్న అప్పులు రూ. 6.46 లక్షల కోట్లు ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వమే ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లో స్పష్టమైనప్పటికీ టీడీపీ ఇంకా అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది.
శాసనమండలిలో యనమల రామకృష్ణుడు రూ.14 లక్షల కోట్లు అప్పులున్నాయని ఇంకా అబద్దాలు చెప్తున్నారు. తెచ్చిన మొత్తం అప్పులను కాగ్ కు వెల్లడించలేదని యనమల ఆరోపిస్తున్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులను కాగ్కు చెప్పలేదని మరో విచిత్రమైన ఆరోపనణ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఐదునెలలు అయ్యింది. మరి ఈ ఐదునెలలకాలంలో అప్పులు ఇంకా ఉన్నాయి, దాచిపెట్టారని అనుకుంటే ఎందుకు తవ్వితీయలేదు? అప్పులను దాచేశారని కనిపెట్టి ఉంటే.. ఎందుకు బడ్జెట్ పత్రాల్లో పెట్టలేదు?రూ.2.23లక్షల కోట్లు బడ్జెట్యేతర అప్పులు వైయస్ఆర్సీపీ చేసిందని చెబుతున్న యమనల అలా ఉంటే వాటిని ఎందుకు బడ్జెట్ పత్రాల్లో పెట్టలేదు. ఆర్థిక శాఖామంత్రిగా పలుమార్లు పనిచేసిన యనమలకు బడ్జెట్ పత్రాలుకూడా అర్థంకాలేదు. రూ.2.23లక్షల కోట్లమేర పూచీకత్తుల కింద అప్పులు తీసుకునేందుకు మాత్రమే ప్రభుత్వానికి పరిమితి ఉందని, అంత వెసులుబాటు ఉన్నా గ్యారంటీలు చూపి కేవలం రూ.1.54 లక్షలకు మాత్రమే చేసిందని కాగ్ చెప్పింది. మరి యనమల పచ్చి అబద్ధాలు ఎలా చెప్తారు?అలాగే గ్యారంటీల ద్వారా అప్పులు తీసుకునే వెసులుబాటును బాగా పెంచేశారని కూడా యనమల అబద్ధాలు చెప్పారు. రాష్ట్రం ఆదాయం 1.74 లక్షల కోట్లు అయితే ఇందులో గ్యారంటీలద్వారా అప్పులు 89శాతం కూడా చేరుకోలేదు. మరి యనమల ఇన్ని పచ్చి అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు. పూచీకత్తుల ద్వారా అప్పులకోసం వెసులుబాటు పెంచుకుని అప్పులు తీసేసుకున్నారన్నది వాస్తవం కాదు. ఎఫ్ఆర్బీఎం చట్టంలో రిస్క్ అడ్జస్ట్మెంట్ గురించి యనమలకు తెలియదా? పూచీకత్తుల ద్వారా తీసుకున్న అప్పులకు రిస్క్ అడ్జస్ట్మెంట్ నిర్ణయించిన దానికన్నా.. చాలా తక్కువగా ఉందనే విషయం యనమలకు తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. రిస్క్ అడ్జస్ట్మెంట్ చేయకున్నా సరే.. గ్యారంటీల ద్వారా అప్పులు రాష్ట్ర ఆదాయాల్లో 89శాతం దాటడం లేదు. ఒకవేళ రిస్క్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే గనుక గ్యారంటీల కన్నా తీసుకున్న అప్పులు మరింత తక్కువే. మరి యనమల ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. చేబదుళ్లు అంటే కూడా అర్థం తెలియని వ్యక్తి యనమల. చేబుళ్లు కింద తీసుకున్నవి వెంటనే కట్టాలి. అలా చేస్తేనే మళ్లీ ఇస్తారు. 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి చేబదుళ్లు కింద రాష్ట్రం ఇవ్వాల్సినవి కేవలం రూ.594 కోట్లు మాత్రమే. కాని.. యనమల రూ.2 లక్షల కోట్లు భారం ఉందని అన్నట్టుగా మండలికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండేచర్కూ, క్యాపిటల్ అవుట్లేకూ తేడా ఉందని చెప్పుకుంటూ ఆరోపణలు చేశారు. క్యాపిటల్ అవుట్ లే ప్రకారం అసలు ఖర్చుపెట్టలేదన్నట్టుగా చెప్పారు. వాస్తవంగా క్యాపిటల్ అవుట్లే వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో రూ.12,242 కోట్లు అయితే, గత ఆర్థిక సంవత్సరం నాటికి రూ.23,330 కోట్లకు చేరింది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జీఎస్డీపీ బాగా పడిపోయింది, నెగెటివ్ గ్రోత్ వచ్చిందని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. జగన్గారికి ఎకానమీ అంటూ తెలియదని తప్పుడు మాటలు మాట్లాడారు. వాస్తవం ఏంటంటే వైయస్ఆర్సీపీ హయాంలో జీడీపీలో రాష్ట్ర జీఎస్డీపీ 4.83శాతానికి పెరిగింది. టీడీపీ 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఇది కేవలం 4.42శాతం మాత్రమే. నిన్నటి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్మీట్, ఆయన చూపించిన సాక్ష్యాధారాలతో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయి... ఇకనైనా అబద్దాలు చెప్పడం మానుకుంటే మంచిదని వైయస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్రెడ్డి హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa