ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్ల మంజూరు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల బకాయిలు ఒకేసారి అందించడంతో పాటుగా.. స్పౌస్ పింఛన్లు డిసెంబర్ నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్ లబ్ధిదారుల్లో 3 లక్షల మంది అనర్హులుండగా.. కొత్తగా 2లక్షల మంది అర్హులు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. శాసనసభ సమావేశాల్లో నాలుగో రోజు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ ఇచ్చారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, పల్లె సింధూరరెడ్డి, ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ పింఛను అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్. టీడీపీ పాలనలోనే.. 2014లో రూ.200గా ఉన్న పింఛన్ను రూ.2వేలకు.. ఇప్పుడు రూ.4వేలకు పెంచారన్నారు. గత ప్రభుత్వంలో జగన్ ఐదేళ్లలో రూ.వెయ్యి మాత్రమే.. అది కూడా నాలుగు దశల్లో పెంచారని గుర్తు చేశారు. అనర్హులకు పింఛన్లు తొలగిస్తే అర్హులకు న్యాయం చేయొచ్చన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. కొందరు వైద్యులు దివ్యాంగులు కానివారికి కూడా సదరం ధ్రువపత్రాలు వ్యాఖ్యానించారు. దాన్ని నియంత్రించాలని సూచించారు. అయితే అనర్హుల్ని గుర్తించేందుకు.. ప్రతి సదరం ధ్రువీకరణ పత్రాన్ని తనిఖీ చేసే విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ సచివాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి అర్హులైనవారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు మంత్రి. పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులు ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో ఆ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని సూచించారు. అలాగే వరుసగా మూడు నెలల పాటూ గ్రామంలో అందుబాటులో లేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పింఛన్ తాత్కాలికంగా నిలిపివేస్తామని.. ఆ తర్వాత వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారికి తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. అనారోగ్య కారణాలతో పూర్తిగా మంచానికి, వీల్చైర్కు పరిమితమైన వారు పొందే పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు చాలామంది అనర్హులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటన్నింటిని మళ్లీ సమీక్షించి సంబంధిత శాఖ అధికారులతో విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని భావిస్తోంది.. ఈ మేరకు ఆ దిశగా కసరత్తు చేస్తోంది. జనవరిలో జన్మభూమి కార్యక్రమం మొదలుపెట్టి.. అప్పడు కొత్త పింఛన్లను అందించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa