ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏళ్ల తరబడి ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న ప్రాజెక్టులకు కూడా మోక్షం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం అందుతున్న నేపథ్యంలో.. కీలకమైన ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తున్నాయి. నిర్మాణాల దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఏపీకి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ఏపీలో కొత్త స్టేట్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లా వేమగిరి నుంచి సామర్లకోట వరకూ ఉన్న కెనాల్ రోడ్డును స్టేట్ హైవేగా మార్చేందుకు కేంద్రం అంగీకరించింది. 62 కిలోమీటర్ల మేరకు ఉన్న ఈ కెనాల్ రోడ్డును స్టేట్ హైవేగా మార్చేందుకు అంగీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఉపరితల, రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అనుమతులు పంపించారు.
రాజమండ్రి గ్రామీణంతో పాటుగా, అనపర్తి, పెద్దాపురం, మండపేట ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ కెనాల్ రోడ్డే ఆధారం. అయితే ఈ కెనాల్ రోడ్డుపై గుంతలు తేలి.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పుడప్పుడూ ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కెనాల్ రోడ్డును రాష్ట్ర హైవేగా మార్చాలన్న ప్రతిపాదనను టీడీపీ కూటమి సర్కారు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జులైలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఈ విషయం మీద లేఖ రాశారు. ఎన్హెచ్-16 వేమగిరి నుంచి సామర్లకోట ఎన్హెచ్-216 వరకు 62 కి.మీ. మేర అనుసంధానం చేయడం ద్వారా కాకినాడ పోర్టుకు మూడో ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేయవచ్చని చంద్రబాబు సూచించారు. దీంతో పాటు టెంపుల్ టూరిజం, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతున్న సామర్లకోట, రాజమహేంద్రవరం వాసులకు ఉపయోగకరంగా ఉంటుందంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నితిన్ గడ్కరీ అనుమతులు ఇచ్చారు.
మరోవైపు వేమగిరి, సామర్లకోట రహదారి అభివృద్ధికి గతంలోనే అడుగులు పడ్డాయి. 2016లో ప్రపంచబ్యాంక్ నిధులతో ఈ రోడ్డును అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ మొదలైంది. అయితే పనులు మాత్రం ముందుకు పడలేదు. దీనికితోడు రోడ్డంతా గుంతలమయం కావటంతో ఈ రోడ్డుపై ప్రయాణమంటే వాహనదారులు భయపడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరమ్మత్తులకు నిధులు కేటాయించింది. ఇప్పుడు రాష్ట్ర రహదారిగా మార్చేందుకు కేంద్రం నుంచి అనుమతులు రావటంతో.. ఈ ప్రాంతవాసులకు ఇబ్బందులు తప్పనున్నాయి. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa