తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తీపికబురు. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలలో వసతి గదులు దొరక్క ఇబ్బంది పడే భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ నూతన లాకర్ కౌంటర్ అందుబాటులోకి తెచ్చింది. యాత్రికుల వసతి సముదాయం -3లో సెంట్రల్ లాకర్ కౌంటర్ అందుబాటులోకి తెచ్చారు. తిరుమలలో గదులు దొరకని భక్తులు ఇబ్బంది పడొద్దని.. ఈ లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ సూచించింది.
తిరుమల కొండపై వెలసిన శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అయితే శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు కొండపై ఉండటానికి గదులు అద్దెకు తీసుకుంటూ ఉంటారు. భక్తుల కోసం టీటీడీ వసతి గదులను కూడా అందుబాటులో ఉంచింది. ఇక వసతి గదులు దొరకని పక్షంలో.. కొండపై ఉన్న లాకర్లలో తమ సామాగ్రిని భద్రపరుచుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు లాకర్లలో తమ వస్తువులను భద్రపరుచుకుని.. దర్శనం తర్వాత తిరిగి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇందుకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంటోంది. తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంల లాకర్ల కోసం కూడా భారీగా డిమాండ్ ఉంటోంది.
ఈ నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ మరో లాకర్ కౌంటర్ అందుబాటులోకి తెచ్చింది. తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ను టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం ప్రారంభించారు. పీఏసీ-3లో లాకర్ కేటాయింపునకు మూడు కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే భక్తులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ సిబ్బంది ఇకపై ఒకచోట లాకర్లను కేటాయిస్తారు. శ్రీవారి భక్తుల కోసం ఇక్కడ 1420 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. గదులు దొరకని భక్తులు అసౌకర్యం కలగకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ సూచించింది.
మరోపైపు టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం పీఏసీ - భవనాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఈ భవం నిర్మాణంలో ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులను పరిశీలించిన టీటీడీ ఈవో.. అధికారులకు కీలక సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారి భక్తులకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఈ భవనంలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రాన్ని పరిశీలించారు. విరాళాల కోసం టీటీడీ ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన కియోస్క్ మిషన్ల పనితీరును పరిశీలించారు. అనంతరం అన్నప్రసాద కేంద్రంలోని డోనార్ సెల్ను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa