ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్య వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించారు.. ప్రభుత్వంలో కీలకమైన శాఖల సమన్వయంతో ‘పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థ’ను ఏర్పాటు చేస్తూ సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ మార్గదర్శకాలు విడుదల చేశారు. పిఠాపురంలో ప్రధాన కార్యాలయం ఉంటుంది.. ఇక్కడ పనులు పర్యవేక్షించేలా సీనియర్ ఆర్డీవోను ప్రాజెక్టు డైరెక్టర్గా నియమిస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రభుత్వ- ప్రైవేటు- ప్రజల భాగస్వామ్యంతో.. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా)గా ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు, పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించి పథకాలు అమలుచేస్తారని ప్రస్తావించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పిఠాపురం పర్యటనకు వెళ్లిన సమయంలో ‘పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థ’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఇటీవల కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ముందు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా)గా అనుకున్నా .. ఆ తర్వాత ‘అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ పిఠాపురం’ అని పేరు నిర్ణయించేలా ప్రతిపాదన వచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మరింత పెంచేలా నిర్ణయం తీసుకున్నారు.
పిఠాపురానికి సంబంధించి ఇటీవల కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వీటిలో పట్టణంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి.. రూ.38.32 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయనున్నారు. ఈ ఆస్పత్రితో మొత్తం 8 మండాలల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 20మంది సిబ్బంది ఉండగా.. అదనంగా 66 పోస్టులు రానున్నాయి. ఫ్రీజర్ కొనుగోలు, మార్చురీ గదికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.1.07 లక్షలు నిధులు మంజూరు చేశారు. అలాగేగ్రామీణ రోడ్లకు రూ.10 కోట్లు, రోడ్ల మరమ్మతుల కోసం మరో రూ.3 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ బస్టాండును అభివృద్ధి చేయనున్నారు. కేఎస్ఈజెడ్ కోసం ఈ ప్రాంతంలో 10 వేల ఎకరాలు కేటాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa