ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించనున్నట్లు తెలిసింది. 10 నుంచి 15 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రెండు రిఫైనరీల ఏర్పాటు కోసం కేంద్రం.. సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ రెండు రిఫైనరీలలో ఒకదానిని గుజరాత్లోనూ, మరో రిఫైనరీని ఆంధ్రప్రదేశ్లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. రిఫైనరీలతో పాటుగా పెట్రోకెమికల్ సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు సమాచారం. ఏపీలో రిఫైనరీ ఏర్పాటు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో కోరుతున్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉండటంతో రిఫైనరీ ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాస్తవానికి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మెగా ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే అక్కడ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటంతో ఈ ప్రాజెక్టు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్లలో రిఫైనరీల ఏర్పాటు కోసం సౌదీ అధికార యంత్రాంగంతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. గుజరాత్లో ఏర్పాటు చేయదలిచిన రిఫైనరీ కోసం సౌదీ అరామ్కో భాగస్వామిగా ఓఎన్జీసీగా ప్రతిపాదించగా.. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే రిఫైనరీగా భాగస్వామిగా బీపీసీఎల్ ఉండనున్నట్లు తెలిసింది. మరోవైపు భారతదేశంలో 100 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెడతామంటూ సౌదీ అరేబియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు గుజరాత్లోని జామ్నగర్లో ఇప్పటికే రిలయన్స్, న్యారా ఎనర్జీ రిఫైనరీలు ఉన్నాయి. అలాగే వడోదరలో ఇండియన్ ఆయిల్ రిఫైనరీ ఉండగా.. ఓఎన్జీసీ రిఫైనరీ నాలుగోది కానుంది. ఇక ఏపీ విషయానికి వస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో.. ఏపీలో రిఫైనరీ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో విభజన హామీల అమలుకు పట్టుబడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రిఫైనరీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. అలాగే మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో రిఫైనరీ ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం.. భూసేకరణకు స్థానికులు ఒప్పుకోకపోవటంతో.. ఆ రిఫైనరీ ప్రాజెక్టు ఏపీకి తరలించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రాజెక్టు విషయం ఇంకా చర్చల దశల్లోనే ఉందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa