ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో తుఫాన్ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 07:43 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫెయింజల్‌ తుఫాన్‌ ప్రభావంపై సమీక్ష చేశారు. కలెక్టర్లు, సీఎంవో, విపత్తు నిర్వహణ శాఖ, రియల్‌ టైం గవర్నెన్స్‌ అధికారులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. ఈ మేరకు అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని అధికారులకు చెప్పారు. తుఫాన్‌పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని.. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని ఆదేశించారు.


మరోవైపు ఫెయింజల్ తుఫాను ఎఫెక్ట్ తిరుపతి జిల్లాపై పడింది. తిరుమలలో నిన్న రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మరోవైపు దట్టంగా కమ్మేసిన మంచు, పెరిగిన చలి కారణంగా.. భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. పాపవినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు. చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అలాగే, తిరుపతి నగరంలోనూ శుక్రవారం రాత్రి నుంచీ వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు సాయం కోసం 0877 - 2236007 నెంబర్‌ను సంప్రదించవచ్చు.


భారీ వర్షంతో తిరుపతి విమానాశ్రయం రన్‌వేపై వరద నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానం.. రన్‌వే వరద నీటితో నిండిపోవడంతో ల్యాండ్ అవ్వలేదు. ఆ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ 6 విమానాలను ఈరోజు రద్దు చేసింది. వీటిలో బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్ సర్వీసులు ఉన్నాయి. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతున్నాయ.


బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారడంతో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ఫెయింజల్ అని వాతావరణ శాఖ పేరు పెట్టింది. ఈ ఫెయింజల్ తుఫాను.. పుదుచ్చేరి, తమిళనాడు తీరాలవైపు బలంగా దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ఫెయింజల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.


బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తుండటంతో శనివారం సాయంత్రం 5 గంటల వరకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే శుక్రవారం నుంచి విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పలు ఎయిర్‌లైన్లు ప్రకటించాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. తాజాగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com