ఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా తిరుమలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా తిరుమలలోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఐదు ప్రధాన జలాశయాలు నిండుకుండలా మారాయి. తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. దీంతో అధికారులు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఐదు జలాశయాల్లో ఉన్న నీరు.. తిరుమలకు 200 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతుందని అధికారులు చెప్తున్నారు. జలకళను సంతరించుకున్న జలాశయాలకు టీటీడీ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి పాపవినాశనం డ్యామ్లో నీటిమట్టం 694.25 మీ.. ఎఫ్ఆర్ఎల్ 697.14 మీటర్లుగా ఉంది. అలాగే గోగర్భం డ్యామ్లో నీటిమట్టం 2894.00 అడుగులుగా..ఎఫ్ఆర్ఎల్ 2894.00 అడుగులుగా ఉంది. ఆకాశగంగ డ్యామ్ పూర్తి రిజర్వాయర్ లెవల్ 865 మీటర్లు కాగా.. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి నీటిమట్టం 857.85 మీటర్లుగా ఉంది. కుమారధార డ్యామ్లో పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం 898.24 మీటర్లు కాగా.. నీటిమట్టం 891.00 మీటర్లకు చేరుకుంది. పసుపుధార డ్యామ్ పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం 898.24 మీటర్లు కాగా.. 896.40 మీటర్లకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని నెలల కిందట ఆగస్టులో తిరుమల తాగునీటి అవసరాల కోసం నీటి కొరత ఏర్పడింది. అయితే ఇప్పుడు జలాశయాలు పూర్తి జలకళను సంతరించుకోవటంతో తిరుమల తాగునీటి అవసరాలు మరో ఆరు నెలలపాటు ఢోకా లేనట్టే.
మరోవైపు భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పాపవినాశనం, శ్రీవారిమెట్టు మార్గాలను టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే కొండపై నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో తిరుపతి కపిలతీర్థంలోని పుష్కరిణిలోకి భక్తులను అనుమతించడం లేదు. అలాగే తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విరిగిపడిన చెట్లు, బండరాళ్లు. కొండచరియలను తొలగించారు. అలాగే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు తిరుమలలో గదులు దొరకని భక్తులు ఆరు బయటే సేదతీరుతున్నారు. టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో వేచి ఉంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa