ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకాన్ని నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారం తప్పని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. టీడీపీ కూటమి సర్కారుపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తు్న్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. 200 యూనిట్ల వరకూ ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం తీసుకువచ్చిందే తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరాను కూటమి ప్రభుత్వం ఎత్తివేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడుతోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఆపివేశారని.. వైసీపీ ప్రభుత్వంలో మాఫీ చేసిన బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం ఎత్తివేశారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్తున్నారు. పథకం కొనసాగుతోందని క్లారిటీ ఇస్తున్నారు.
మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం సంబంధించి ఎవరైనా అర్హులు ఉండి, పథకం లబ్ధిని అందుకోలేకపోతే ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ పథకానికి అర్హులైన వారు కులధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్) సహా ఇతరత్రా వివరాలతో దగ్గరలోని మీసేవ కేంద్రం, విద్యుత్ కార్యాలయాలను సంప్రదిస్తే పథకం వర్తించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలు ఉంటే.. ప్రతి నెలా 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పొందే వీలుందని అధికారులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa