ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు ప్రమోషన్.. కీలక పదవితో పాటూ కేబినెట్ ర్యాంక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 08:11 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేయగా.. పార్టీ కోసం కష్టపడినవారికి ప్రాధాన్యం ఇచ్చారు. మూడో జాబితాను కూడా త్వరలోనే విడుదల చేస్తారని చెబుతున్నారు.. ఈ లిస్ట్‌కు సంబంధించి కసరత్తు దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా మరో కీలక పదవిని కూడా భర్తీ చేశారు.. ఈ మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు బంపరాఫర్ ఇచ్చారు. ఆయనకు ఏకంగా కేబినెట్ ర్యాంకు పదవి దక్కింది.


ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌ (కార్యక్రమాల నిర్వహణ)గా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను నియమించారు. కీలక పదవితో పాటుగా కేబినెట్ ర్యాంక్ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కావడంతో పెందుర్తి వెంకటేష్‌కు కేబినెట్ ర్యాంక్ దక్కిందనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు నుంచి పెందుర్తి వెంకటేష్ చంద్రబాబు కార్యక్రమాలకు సంబంధించి కోఆర్డినేటర్‌గా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు అధికారికంగా కోఆర్డినేటర్‌గా నియమించారు.


పెందుర్తి వెంకటేష్ తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి చిట్టూరి రవీంద్ర పై 6,936 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మి పై 8887 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వెంకటేష్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా చేతిలో 31772 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


2019 ఎన్నికల తర్వాత వెంకటేష్ రాజానగరం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అయితే గతేడాది జనవరిలో ఆయన నియోజకవర్గ ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేశారు.. పార్టీలో మాత్రం కొనసాగుతానని.. స్థానిక పరిస్థితులతో రాజీనామా చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత బొడ్డు వెంకటరమణ చౌదరిని రాజానగరం టీడీపీ ఇంఛార్జ్‌గా నియమించింది అధిష్టానం. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొడ్డు వెంకటరమణ చౌదరికి టికెట్ దక్కలేదు.. కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సీటు కేటాయించారు. రాజానగరం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీచేసిన బత్తుల బలరామకృష్ణ పోటీచేసి విజయం సాధించారు. అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరికి రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నామినేటెడ్ పదవి దక్కింది. ఇప్పుడు తాజాగా పెందుర్తి వెంకటేష్‌కు ఏకంగా కేబినెట్ ర్యాంక్ దక్కింది. మొత్తానికి రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలకు మంచి పదవులు దక్కాయనే చర్చ జరుగుతోంది. పెందుర్తి వెంకటేష్, బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరంలో జనసేన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయడంతో ప్రమోషన్ దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com