ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహం తగ్గించుకుని చిరంజీవి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పు.. లేదంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 08:13 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. డిసెంబర్ 4 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలుకానున్నాయి. ఈ క్రమంలో పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామంటూ జనసేన పార్టీకి చెందిన ఓ నేత వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్.. చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని, సారీ చెప్పకపోతే అల్లు అర్జున్ సినిమాను అడ్డుకుంటామని గన్నవరం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించారు.


" అల్లు అర్జున్‌కు గతంలోనే చెప్పాం. అల్లు అర్జున్ పోకడ, జనసైనికులకు, మెగా అభిమానులకు బాధ కలిగిస్తోంది.ప్రతిపక్షం వాళ్లు మాట్లాడితే పట్టించుకోం. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన వాడిని, మెగా కాంపౌండ్‌లో పెరిగానని.. చిరంజీవి అంటే అభిమానమని చెప్పుకునే అల్లు అర్జున్ ఇలా ప్రవర్తిస్తారా? చిరంజీవి అడుగుజాడల్లో నడిచేవారు ఎవరైనా.. ఆయన సంస్కారాన్ని, పద్ధతులను, సేవా కార్యక్రమాలను అలవరచుకుంటారు." అని జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు అన్నారు .


మెగా ఫ్యామిలీ అంటే అందరికీ ఓ ప్రత్యేకమైన అభిమానమని చెప్పిన జనసేన నేత రమేష్ బాబు.. వారి సేవా కార్యక్రమాలు, రాష్ట్రం కోసం పడే తపన అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అలాంటి మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించారన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారని.. అలాంటి నాయకుడిని అందరం మద్దతుగా నిలబడాలన్నారు. అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్‌ను గుర్తించకుండా అహంతో మాట్లాడుతున్నారని జనసేన నేత మండిపడ్డారు.


"మిస్టర్ అల్లు అర్జున్.. నీ సినిమాను అడ్డుకుంటాం. జనసైనికులు, మెగా అభిమానులు అందరం డిసెంబర్ 5న విడుదలయ్యే నీ సినిమాను అడ్డుకుంటాం. కనీసం మూడు రోజులు ఆడకుండా చేస్తాం. ఇప్పటికైనా నువ్వు క్షమాపణలు చెప్పు. చిరంజీవి కాళ్లు కడిగి ఆ నీళ్లు నువ్వు నెత్తిన చల్లుకో.. అది కానీ జరగకపోతే.. నీ సినిమాను అడ్డుకుంటాం." అంటూ జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు వార్నింగ్ ఇచ్చారు.


మరోవైపు హైదరాబాద్‌లో జరిగిన పుష్ప 2 సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మెగా కుటుంబం గురించి ప్రస్తావించలేదని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్ నడుస్తోంది. ఇప్పుడు జనసేన నేత చలమశెట్టి రమేష్ బాబు చేసిన వ్యాఖ్యలతో ఈ ఫ్యాన్ వార్ మరింత ముదిరేలా కనబడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com