ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన భూ ప్రకంపనలు.. ఈ ఏడు జిల్లాల్లోనే, భయంతో జనం పరుగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 08:14 PM

ఆంధ్రప్రదేశ్‌ను భూ ప్రకంపనలు వణికించాయి. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, జగ్గయ్యపేట, నందిగామతో పాటుగా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ,తిరువూరు, పెనుగంచిప్రోలు, గంపలగూడెం, అనుముల్లంక ప్రాంతాల్లో భూమి కంపించింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టయగూడెం, టి.నరసాపురం మండలం బొర్రాంపాలెంలో భూ ప్రకంపనలు వచ్చాయి.


తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి, గోపాలపురం మండలాలు.. రాజమండ్రి తాడితోట, మోరంపూడి ప్రాంతాల్లో సెకన్లపాటు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్‌లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లో భూమి కంపించిందని స్థానికులు అంటున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కూడా ప్రకంపనల ధాటికి ఇళ్లల్లోని వస్తువులు సైతం కిందపడిపోయినట్లు స్థానికులు అంటున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది.


ఏపీ మాత్రమే కాదు తెలంగాణలో కూడా భూమి కంపించింది. హైదరాబాద్‌‌తో పాటుగా రంగారెడ్డి, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, జనగామ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రంకపనలతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. హైదరాబాద్‌ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో తీవ్రత కనిపించింది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూమి కంపించింది. సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు జనాలు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటూ పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.


ఈ భూ ప్రకంపనల కేంద్రాన్ని తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమీపంలో గుర్తించారు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.0గా నమోదుకాగా..భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో భూమి కంపిచిందని చెబుతున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆ తీవ్రతతో నేడు ప్రకంపనలు వచ్చినట్లు భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థానచలనం కారణంగా ప్రకంపనలు వస్తుంటాయని.. 1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, ములుగు, భద్రాచలం, ఏటూరు నాగారం తదితర ప్రాంతాలు జోన్‌-3లో ఉన్నాయంటున్నారు. జోన్‌-5లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రకంపనలతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com