ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ బియ్యం స్మగ్లింగ్‌ సంగతి సరే.. మరి ఆ విషయమేంటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 06:40 PM

ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు సంగతి సరే కానీ.. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి సంగతి ఏమింటంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై విచారణ ఎప్పుడని ప్రభుత్వ విధానాలను నిలదీస్తూ వైఎస్ షర్మిల ఎక్స్‌లో ట్వీట్ చేశారు.


"రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషం. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ? బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. ఆ విషయంలో ఎందుకు పెట్టలేకపోతున్నారు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? మీరు కూడా అమ్ముడుపోయారా? తీగ లాగితే అదానీని కూడా అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారు?" అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.


సెకీ ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఆరోపించిదనీ.. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. 25 ఏళ్ల పాటు ఒప్పందం అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్షకోట్ల వరకూ భారం పడుతుందని అప్పట్లో టీడీపీ విమర్శించిందనీ.. ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అప్పట్లో హైకోర్టులో కూడా కేసు వేయించారని షర్మిల గుర్తు చేశారు. తాము అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని.. గొప్ప గొప్ప మాటలు చెప్పిన టీడీపీ.. ఇప్పుడు ఏం చేస్తోందంటూ వైఎస్ షర్మిల నిలదీశారు. అన్ని ఆధారాలు దగ్గర ఉంచుకుని, అధికారం దగ్గర పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు చంద్రబాబు సార్.. అంటూ షర్మిల ట్వీట్ చేశారు.


అదానీ ఒప్పందాలపై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ చేసినవి నిజమైన ఉద్యమాలే అయితే.. వెంటనే ఈ విషయం మీద విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ తరుఫున వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఏసీబీని పంజరం నుంచి విడుదల చేయాలని.. రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరపడంతో పాటుగా ఆ సోలార్ డీల్ రద్దు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa