ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన వాసిరెడ్డి పద్మ.. వచ్చే వారం ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 07:11 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మరో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వాసిరెడ్డి పద్మ తన నిర్ణయాన్ని వెల్లడించారు. వచ్చే వారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో వాసిరెడ్డి పద్మ శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరే విషయమై కేశినేని చిన్నితో చర్చించినట్లు తెలిసింది. అనంతరం వచ్చే వారం టీడీపీలో చేరనున్నట్లు వాసిరెడ్డి పద్మ ప్రకటించారు.


2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన వాసిరెడ్డి పద్మ.. నెలరోజుల కిందట వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ విధానాలపైనా, వైఎస్ జగన్ తీరుపైనా ఘాటు విమర్శలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల అవసరం లేదన్నట్లుగా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని.. జగన్‌కు పార్టీని నడిపించడంలో, పరిపాలన చేయడంలో బాధ్యత లేదంటూ వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని.. త్వరలోనే రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వాసిరెడ్డి పద్మ అప్పట్లో చెప్పారు. రాజీనామా నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరతారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.


చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా వాసిరెడ్డి పద్మ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం వైసీపీలో చేరిన వాసిరెడ్డి పద్మ.. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా నియమించారు. అయితే 2024 ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెకు అవకాశం దక్కలేదు.


ఎన్నికల అనంతరం జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. దీంతో జగ్గయ్యపేట వైసీపీ ఇంఛార్జి పదవి దక్కుతుందని వాసిరెడ్డి పద్మ భావించారు. అయితే వైఎస్ జగన్ ఆ బాధ్యతలను తన్నీరు నాగేశ్వరరావుకు అప్పగించడంతో.. అసంతృప్తితో వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా టీడీపీలో చేరనున్నట్లు వాసిరెడ్డి పద్మ ప్రకటించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa