గత వైసిపి హయాంలో సోషల్ మీడియాలో రచ్చ చేసిన వారు చాలామంది ఉన్నారు. అందులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ఒకరు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు బోరుగడ్డ అనిల్ కుమార్.కూటమి అధికారంలోకి రావడంతో ఆయన పాపాలు పండాయి. వరుస కేసులు ఎదుర్కొంటున్న ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన పై నమోదైన కేసులకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. అయితే ఎక్కడా అనిల్ నోరు విప్పడం లేదు. అయితే అనంతపురంలో నమోదైన ఓ కేసుకు సంబంధించిన విచారణలో మాత్రం ఆయన నోరు తెరిచినట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విచారణ నిమిత్తం అనంతపురం పోలీసులు అనిల్ ను తీసుకెళ్లారు. తొలిరోజు ఆయన నోరు తెరవలేదు. కానీ రెండో రోజు మాత్రం కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అప్పట్లో వైసీపీ హై కమాండ్ ఒత్తిడితోనే సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టాల్సి వచ్చిందని పోలీస్ విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అప్పట్లో చంద్రబాబుతో పాటు లోకేష్, వారి కుటుంబ సభ్యులను దూషించిన వీడియోలు ఆధారంగా అనిల్ ను విచారించారు. పోలీసులు పదేపదే ప్రశ్నించేసరికి తాను వైసీపీ హై కమాండ్ ఆదేశాలు మేరకే మీడియాలో పోస్టులు పెట్టినట్లు చెప్పుకొచ్చాడట. అసలు ఆ వీడియోలు చేయమని ఎవరు చెప్పారు అన్న ప్రశ్నకు గుర్తు లేదని దాటవేసినట్లు సమాచారం. విచారణ అనంతరం అనంతపురం పోలీసులు బోరుగడ్డ అనిల్ ను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
గత కొంతకాలంగా పోలీసుల అదుపులో ఉన్నారు బోరుగడ్డ అనిల్. ఇప్పటికీ ఆయనకు పోలీస్ శాఖలో ఇన్ ఫార్మర్లు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఓకేసు నిమిత్తం రిమాండ్ విధించిన నేపథ్యంలో.. జైలుకు తరలిస్తుండగా ఆయనతో పోలీసులు బిరియాని తిన్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులపై వేటు కూడా పడింది. మరోవైపు పోలీస్ స్టేషన్లలో సైతం రిమాండ్ లో ఉన్నప్పుడు అనిల్ కు సకల సౌకర్యాలు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సమగ్ర విచారణ చేపడుతోంది. ఈ విచారణలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే వైసిపి హయాంలో దూకుడుగా వ్యవహరించిన అనిల్.. ఇప్పుడు సన్నబడుతూ కనిపిస్తున్నారు.
మరోవైపు విచారణలో కీలక అంశాన్ని బయటపెట్టారు బోరుగడ్డ అనిల్. అప్పట్లో యూట్యూబ్ ఛానల్ నిర్వాకం వల్లే తాను ఇరుక్కున్నానని చెప్పినట్లు సమాచారం. తన ఇంటర్వ్యూను యధాతధంగా ప్రసారం చేయడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆజ్ఞాపిస్తే కొందరు నేతలను లేపేస్తానని కూడా హెచ్చరించారు. పవన్ తో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాను నాటి ఇంటర్వ్యూను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ దే తప్పు అన్నట్టు బోరుగడ్డ చెబుతుండడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa