సినీ నటుడు అల్లు అరెస్ట్ విషయాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం, సామాన్యులకు, సినీ నటులకు ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విపక్షంలో ఉన్న సమయంలో నిర్వహించిన రాజకీయ సభలలో సామాన్య ప్రజానీకం చనిపోయిన విషయాన్ని కేఏ పాల్ గుర్తు చేశారు. చంద్రబాబు కందుకూరు సభలో 8 మంది చనిపోయారని.. గుంటూరులో నిర్వహించిన సభలో ముగ్గురు చనిపోయిన విషయాన్ని కేఏ పాల్ ప్రస్తావించారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు స్టంట్ కారణంగా 23 మంది చనిపోయారని కేఏ పాల్ విమర్శించారు.
మరి చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేశారా.. ఆయనను పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించారా? అంటూ కేఏ పాల్ విమర్శించారు. రాజకీయ నాయకులకు ఓ న్యాయం.. సామాన్యులు, సినీ తారలకు ఓ న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తున్నారన్న కేఏ పాల్.. వెంటనే అల్లు అర్జున్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ను విడుదల చేయకపోతే ఆయన తరుఫున తాను న్యాయపోరాటం చేస్తానని.. కోర్టులో పిల్ వేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
మరోవైపు పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయారు. ఆమె కొడుకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో రేవతి భర్త అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం సమయంలో పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ వాంగ్మూలం నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా అల్లు అర్జున్ను పోలీసులు రెండు గంటలపాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి నాంపల్లి హైకోర్టుకు తీసుకువెళ్లనున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై పలువురు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటోంది. ఇప్పటికే చిరంజీవి దంపతులు, నాగబాబు.. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa