ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసుల నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 05:53 PM

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చెప్పు చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన కార్యకర్తలు దువ్వాడ శ్రీనివాస్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు రావాలంటూ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు ఇచ్చారు.


మరోవైపు నోటీసులపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఎన్ని నోటీసులు ఇచ్చిన భయపడేది లేదని స్పష్టం చేశారు. 2024 ఏపీ ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలు తనను దుర్భాషలాడారని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. తిడుతూ పోస్టులు పెట్టారని.. కారును తగలబెడతాం, చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. జనసేన కార్యకర్తల బెదిరింపులపై తాను పోలీసులకు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశానన్న దువ్వాడ శ్రీనివాస్.. కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలిపెట్టారని ఆరోపించారు. రెండేళ్ల కిందట తాను చేసిన వ్యాఖ్యలకు పోలీసులు 41 నోటీసులు ఇచ్చి, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న దువ్వాడ శ్రీనివాస్.. జనసేన శ్రేణులపై తాను పెట్టిన కేసును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.


తనతో పాటు దివ్వెల మాధురిని కూడా ఇబ్బందులు పెడుతున్నారన్న దువ్వాడ శ్రీనివాస్.. వీటిపై దివ్వెల మాధురి రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. కంప్లైంట్ ఇచ్చి 15 రోజులు దాటిపోయినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీలు కక్షా రాజకీయాలు చేస్తున్నాయన్న దువ్వాడ శ్రీనివాస్.. ఇంతకు ఇంతా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. న్యూటన్ చెప్పినట్లు చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో.. కూటమి పార్టీల చర్యలకు కూడా తాము అధికారంలోకి వస్తే అదే రీతిలో ఫలితం ఉంటుందని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు.


మరోవైపు విపక్షంలో ఉన్న సమయంలో తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసిన వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అప్పట్లో పేర్ని నాని, దువ్వాడ శ్రీనివాస్ వంటి నేతలు కూడా చెప్పు చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే దువ్వాడ శ్రీనివాస్ మీద కేసు నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa