రాష్ట్రంలో కూటమి నేతలు అడుగడుగునా అధికార దర్పం ప్రదర్శించారన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సాగు నీటి సంఘాల ఎన్నికల కోసం టీడీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులు, పోలీసులపై ఉన్నా వారు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలు సరికాదన్నారు. అందుకే తాము ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులతో కలిసి చంద్రబాబుగారు చేస్తున్నవి దుర్మార్గాలు కావా? నో డ్యూ సర్టిఫికెట్లు వీఆర్వోలు గ్రామ సచివాలయాల్లోనే ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? తహశీల్దార్ కార్యాలయాలకు రమ్మని చెప్పి, అక్కడ పోలీసుల సమక్షంలోనే టీడీపీ వారిచేత దాడులు చేయించడం న్యాయమేనా? నో డ్యూ సర్టిఫికెట్లు గ్రామస్థాయిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం నేరం కాదా? ఈ దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు చేయడం మీ అరాచకపాలనకు నిదర్శనం కాదా? ఎంపీ అవినాష్రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? అలాంటప్పుడు నీటిసంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? మీకు నచ్చినవారిని నామినేట్ చేసుకుంటే సరిపోతుందిగా? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని ఓవైపు డప్పాలు కొట్టుకుంటూ మరోవైపు పోలీసులను దన్నుగా పెట్టుకుని దాడులు చేస్తున్నది నిజం కాదా? అందుకే అప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ నీటి సంఘాల ఎన్నికలను ఖండిస్తూ, బహిష్కరించాలని వైయస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. రైతుల తరఫున ఎప్పుడూ వారికి అండగా ఉంటూ వైయస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది' అంటూ ట్వీట్ చేశారు.
అలాగే మరికొన్ని అంశాలను ట్వీట్లో జగన్ ప్రస్తావించారు. 'దగాపాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయ్యింది. చంద్రబాబు గారు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దంపట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబుగారు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం' అన్నారు.
'చంద్రబాబుగారూ.. ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20వేలు ఎందుకు ఇవ్వడంలేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యంచేసి, ఇ-క్రాప్ను గాలికి వదిలేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహించి, ధాన్యం కొనుగోళ్లను మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడంవల్ల ఇవాళ ప్రతి బస్తాకు రూ.300-400లు నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా? దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వైయస్సార్సీపీ ప్రభుత్వం తీసుకు వస్తే, ఆ ఉచిత పంటలబీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి తమపై అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్పా? ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించకూడదా? తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు ఇది కూడా చేయకూడదని అడ్డుపడ్డం చంద్రబాబుగారి రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను' అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa