భారత్లో ఆర్థిక అసమానతలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ధనికుడు రోజురోజుకూ మరింత ధనికుడు అవుతుండగా.. పేదవాడు మాత్రం నానాటికీ మరింత పేదరికంలో మగ్గిపోతున్నాడు. ఇక ఈ ధనిక, పేద అంతరాలు రోజురోజుకూ పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే పేదరికంలో కూరుకుపోతున్న వారిని ఆ ఊబి నుంచి బయటికి తీసుకువచ్చేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫ్రాన్స్కు చెందిన ఓ ఎకానమిస్ట్.. భారత్లో ఆర్థిక అసమానతల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని సూపర్ రిచ్ వ్యక్తులపై భారత ప్రభుత్వం మరిన్ని పన్నులు విధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారత్లో ఉన్న అధిక ఆదాయ అసమానతలను తగ్గించడానికి అత్యంత సంపన్న వ్యక్తులపై ప్రస్తుతం విధిస్తున్న పన్నులను పెంచాలని ఫ్రెంచ్ ఆర్థికవేత్త, క్యాపిటల్ ఇన్ 21వ సెంచరీ పుస్తకాన్ని రచించిన థామస్ పికెట్టీ తెలిపారు. భారత్లోని ఆర్థిక అసమానతలను నివారించాలంటే దేశంలోని సూపర్ రిచ్ వ్యక్తులపై అధికంగా పన్నులు విధించాలని సూచించారు. దేశంలో రూ.10 కోట్లకు పైన ఆదాయం ఉన్న ధనవంతులపై అధిక పన్ను విధిస్తే భారతదేశ వార్షిక ఆదాయం 2.73 శాతం పెరుగుతుందని థామస్ పికెట్టీ అంచనా వేశారు. పన్నులు విధించడంలో సహకరించడానికి.. 20 దేశాల ఆర్థిక మంత్రులు జులైలో చేసిన ప్రతిజ్ఞను అనుసరించాలని భారత్కు సూచించారు.
ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహించిన ఈవెంట్లో థామస్ పికెట్టీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడిన ఆయన.. రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి సంపన్నులపై 2 శాతం అధికంగా పన్ను విధించడం ద్వారా భారత్ తన జీడీపీలో ఏటా 2.73 శాతం ఆదాయాన్ని పెంచుకోవచ్చని హితవు పలికారు. అదే ఆస్తిపై 33 శాతం వారసత్వపు పన్ను విధించవచ్చని కూడా సూచించారు.
ఈ సందర్భంగా వరల్డ్ ఇన్ఈక్వీలిటీ ల్యాబ్ ప్రచురించిన 2024 నివేదికను పికెట్టీ గుర్తు చేశారు. దేశంలో 1 శాతం అత్యంత సంపన్నులు కలిగి ఉన్న భారత్.. జాతీయాదాయ నిష్పత్తి ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్లోని వారి ప్రత్యర్ధులను మించిపోయిందని పేర్కొన్నారు. 2022-23లో భారత జనాభాలో అత్యంత ధనవంతులైన 1శాతం మంది దేశానికి చెందిన మొత్తం సంపదలో 40.1 శాతాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. ఇక థామస్ పికెట్టీ సూచించిన ధనికులకు పన్ను పెంపు సూచన పట్ల భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తీవ్ర అభ్యంతరం చెప్పారు.
ఇక ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ జాబితా భారత్లో 100 మంది అత్యంత ధనవంతుల మొత్తం సంపద ట్రిలియన్ డాలర్లు దాటినట్లు తేలింది. దేశంలో అపర కుబేరుల సంపద 1.1 ట్రిలియన్ డాలర్లు ఉందని వెల్లడించింది. ఇందులో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 119.5 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. 116 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa