ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూళ్లలో బాంబులు ఉన్నాయంటూ 12 ఏళ్ల స్టూడెంట్ మెయిల్.. పోలీసులకు ఏం కారణం చెప్పాడంటే

national |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 08:15 PM

దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజుల నుంచి బాంబు బెదిరింపులు పెరుగుతుండటం తీవ్ర సంచలనంగా మారుతోంది. ఇక మరీ ముఖ్యంగా స్కూళ్లలో బాంబులు ఉన్నాయంటూ ఫోన్ కాల్స్, మెయిల్స్ రావడం పెను దుమారం రేపుతోంది. ఇలా పదుల సంఖ్యలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం.. ఢిల్లీలోని పోలీసులు, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే ఓ వైపు.. బాంబులు ఉన్నాయా అని తనిఖీలు చేస్తూనే.. మరోవైపు.. ఈ బెదిరింపు కాల్స్, మెయిల్స్ ఎవరు చేస్తున్నారు అనేది గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ 12 ఏళ్ల విద్యార్థే.. మెయిల్ చేశాడని గుర్తించిన అధికారులు.. అతడిని విచారణ జరిపారు. అందులో ఆ స్టూడెంట్ చెప్పిన సమాధానానికి అధికారుల నోట మాట రాలేదు.


శుక్రవారం ఢిల్లీ పశ్చిమ విహార్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, కేంబ్రిడ్జ్ స్కూల్‌తో సహా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్‌ రావడం పెను సంచలనం రేపింది. అయితే ఈ బెదిరింపులు చేసింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివే 12 ఏళ్ల విద్యార్థి అని పోలీసులు గుర్తించారు. దీంతో అతడితోపాటు తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు.. విచారణ చేపట్టారు. అయితే తరచూ ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్నాయని.. టీవీల్లో వస్తున్న వార్తలను చూసి తాను ఆ బెదిరింపు మెయిల్‌ చేసినట్లు ఆ కుర్రాడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇలా వరుసగా బాంబు బెదిరింపులు జరుగుతున్నా.. ఇప్పటివరకు నిందితులను పోలీసులు పట్టుకోవడం లేదని.. దీంతో తీవ్ర ఆవేదన చెంది తాను ఇలా బెదిరింపు మెయిల్ పంపించినట్లు చెప్పాడు. అది విని అధికారులు, పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. ఈ నేపథ్యంలోనే బాలుడితోపాటు అతడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చిన అధికారులు.. తిరిగి ఇంటికి పంపించారు.


ఇక.. శనివారం కూడా ఆర్కేపురం ప్రాంతంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో పాటు మరిన్ని పాఠశాలలకు కూడా ఈ మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు రావడం సంచనలంగా మారింది. ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, బాంబు డిస్పోజబుల్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


మరోవైపు.. ఇలా ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం వారం రోజుల్లో ఇది మూడోసారి కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 9వ తేదీన కూడా ఢిల్లీలోని 40కి పైగా స్కూళ్లలో బాంబులు ఉన్నట్లు బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. స్కూళ్లలో పేలుడు పదార్థాలను పెట్టామని.. వాటిని పేల్చకుండా ఉండాలంటే 30వేల డాలర్లు ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. అయితే అవన్నీ నకిలీ బెదిరింపులు అని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక ఈ ఏడాది మొదటి నుంచి ఢిల్లీ సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో చాలాసార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక అక్టోబరు నెలలో ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని ఓ సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ ముందు బాంబు పేలుడు జరగడం అప్పట్లో పెను సంచనలంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa