అగ్రరాజ్యం అమెరికా వెళ్లేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఆసక్తి చూపస్తుంటారు. న్యాయపరంగా వెళ్లే వాళ్లు కొందరు అయితే అక్రమం మార్గంలో అయినా సరే అక్కడికి వెళ్లిపోయి సెటిల్ అవ్వాలని మరికొంత మంది చూస్తుంటారు. అలాంటి వాళ్లను అక్రమంగా అమెరికా పంపించేందుకు పలు ఏజెంట్ సంస్థలు కూడా పని చేస్తున్నాయి. అయితే తాజాగా 230 మంది భారతీయులను అక్రమంగా అమెరికాకు పంపించే యత్నం చేయగా.. వాళ్లు యూఏఈలో పట్టుబడ్డారు. ఇందులో 170 మంది గుజరాతీలు ఉండడం గమనార్హం.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు పలు ఏజెంట్ సంస్థలు పెద్ద మొత్తంలో వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్నారు. బ్రెజిల్ నుంచి రోడ్డు మార్గంలో మెక్సికో సరిహద్దు ద్వారా అక్రమంగా యూఎస్లోకి ప్రవేశించేందుకు ఏజెంట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే డిసెంబర్ 11వ తేదీన దుబాయ్ నుంచి వీరంతా బయలుదేరాల్సి ఉండగా.. చార్టడ్ ఫ్లైట్ బుక్ చేసేందుకు ఏజెంట్లు 230 మంది నుంచి రూ.3 కోట్లు సేకరించారు. అయితే మెక్సికో-యూఎస్ సరిహద్దులో ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతుండగా.. డిసెంబర్ 20వ తేదీకి ఫ్లైట్ను రీషెడ్యూల్ చేశారు.
అయితే ప్రయాణికులకు మాత్రం విమాన రూట్ వివరాలను ఏజెంట్లు అందించలేదు. దీంతో వాళ్లంతా ఏజెంట్లతో గొడవ పెట్టుకున్నారు. ఈక్రమంలోనే ఏజంట్లు.. డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించేలోపే అందిరనీ అమెరికాకు పంపుతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా డిసెంబర్ 20వ తేదీన ఫ్లైట్ ఉంటుందని.. అప్పటి వరకు అంతా ఓపిక పట్టాలని చెప్పారు. దీంతో అందరూ షార్జాలోని దానా హోటల్లో బస చేస్తున్నారు. వీరితో పాటు పాజీ, ఠాకూర్ సాహెబ్ అనే ఏజెంట్లు కూడా ఉన్నారు.
యూఏఈలోని అధికారులు సాధారణ తనిఖీలు చేస్తుండగా... వీరంతా దొరికిపోయారు. మొత్తం 230 మంది అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే సమీర్, ధవల్, హస్ముఖ్తో పాటు అనేక మంది ఏజెంట్లకు దీనితో సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. 2023 డిసెంబర్ 26వ తేదీన కూడా 260 మంది భారతీయులు అక్రమంగా యూఎస్కు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఫ్రాన్స్లో చిక్కుకుపోయారు. నాలుగు రోజుల తర్వాత తిరిగి వారంతా ముంబయి చేరుకున్నారు. అయితే ఇందులో కూడా 66 మంది గుజరాతీలు ఉండడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa