ఆడిలైడ్ టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. సెంచరీ చేసిన హెడ్ను క్లీన్బౌల్డ్ చేశాక సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. ఇది చూసిన ట్రావిస్ హెడ్.. సిరాజ్ను చూస్తూ ఏదో అన్నాడు. దీంతో సిరాజ్ కూడా తన నోటికి పని చెప్పాడు. చాలు చాలు ఇక బయటికి వెళ్లిపో అంటూ సైగలు చేశాడు.
సిరాజ్, హెడ్ మధ్య మాటలయుద్ధంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా సెంచరీ కొట్టిన లోకల్ బాయ్ హెడ్తో ఆడిలైడ్లో సిరాజ్ అలా గొడవకు దిగి ఉండాల్సింది కాదనే వాదనలు వినిపించాయి. మరికొందరేమో సిరాజ్కు మద్దతుగా మాట్లాడారు. అయితే ఈ ఘటనపై ఆస్ట్రేలియా ఫ్యాన్స్ సిరాజ్ను హేళన చేశారు. సిరాజ్ కన్పించిన ప్రతీసారీ.. బూ బూ అంటూ అరిచారు. సిరాజ్ కూడా వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇంకా గట్టిగా అరవండి అంటూ సైగలు చేశాడు.
అయితే సిరాజ్- హెడ్ ఇష్యూను ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ఇంకా మరిచిపోలేదు. ఇవాళ ప్రారంభమైన మూడో టెస్టులోనూ సిరాజ్పై ఆస్ట్రేలియా ఫ్యాన్స్ అక్కసు వెళ్లగక్కారు. సిరాజ్ను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ. . అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. మూడో టెస్టు తొలి రోజు ఆటలో ఇది జరిగింది.
ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ కూడా స్పందించింది. మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది. హెడ్తో మైదానంలో అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.5 ఆర్టికల్ను సిరాజ్ ఉల్లంఘించాడని పేర్కొంది. ట్రావిస్ హెడ్పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కారణంతో ఇద్దరికీ ఒక్కో డీమెరిట్ పాయింట్ను ఫైన్ వేసింది. అయితే సిరాజ్, హెడ్లు తప్పును అంగీకరించడంతో ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించింది ఐసీసీ. ఇక గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 28/0 స్కోరు వద్ద ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. ఇప్పటికే దాదాపు రెండు సెషన్ల ఆటకు అంతరాయం కలిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa