బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా శనివారం నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లూ చెరొక విజయంతో సమంగా నిలిచాయి. సిరీస్ ఆరంభ మ్యాచ్లో 295 పరుగులతో విజయం సాధించిన భారత్.. ఆడిలైడ్ టెస్టులో మాత్రం పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా యంగ్ బ్యాటర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టెస్టు సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ను తాజాగా ప్రారంభిస్తామని.. అలా భావించే ఆడతామని చెప్పాడు.
“మా సన్నాహకం బాగుంది. ఆడిలైడ్ టెస్టులో మేం అనుకున్న ఫలితం రాలేదు. కానీ, దాని గురించి ఎక్కువ ఆలోచించాలని అనుకోవడం లేదు. ఈ సిరీస్ను ఇకపై మూడు టెస్టులో సిరీస్గానే భావిస్తాం. దాని ప్రకారమే ఆడతాం. మేం గబ్బాలో గెలిస్తే.. మెల్బోర్న్, సిడ్నీలోనూ పైచేయి సాధిస్తాం’ అని గిల్ అన్నాడు.
‘మీరు ఒక విషయం గమనించాలి. క్రితంసారి పర్యటనలోనూ అడిలైడ్లో మేం ఓడిపోయాం. కానీ, ఆ తర్వాత మ్యాచుల్లో గెలిచి.. సిరీస్ కైవసం చేసుకున్నాం. ఇప్పుడూ అదే మైండ్సెట్తో బరిలోకి దిగుతాం. గబ్బాలో మాకు మెరుగైన రికార్డు ఉంది. ఇక్కడ చాలా గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ పిచ్ గురించి కూడా మాకు తెలుసు’ అని శుభ్మన్ గిల్ వ్యాఖ్యానించాడు.
ఇదే సమయంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్లో టైటిల్ సాధించిన భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ను శుభ్మన్ గిల్ అభినందించాడు. టీమిండియా తరఫున అతడికి శుభాకాంక్షలు చెప్పాడు. అతడు భవిష్యత్లోనూ మరిన్ని ఘనతలు సాధించాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు.
2021 సిరీస్ సమయంలో అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ 36 పరుగులకు ఆలౌట్ అయి చిత్తుగా ఓడిపోయింది. అయితే ఆ తర్వాత బలంగా పుంజుకుని.. సిరీస్ కైవసం చేసుకుంది. గత టెస్ట్ సిరీస్లో గబ్బా వేదికగా రిషభ్ పంత్ 89, శుభ్మన్ గిల్ 91 రన్స్ చేయంతో టీమిండియా.. 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 33 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించింది. ఇక గబ్బాలో భారత్ ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడింది. అందులో భారత్ ఒక మ్యాచ్ గెలిచింది. ఐదింట్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa