ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఒక్క పని చేయండి, మీ బాధ్యత మాది.. మావోయిస్ట్‌లకు అమిత్ షా ఆఫర్

national |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 08:03 PM

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశంలో మావోయిస్టుల సమస్య లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఎన్నోసార్లు మావోయిస్టులు లొంగిపోవాలని సూచించారు. ఇక ఇటీవల వరుసగా మావోయిస్టులను ఏరివేసేందుకు ఆపరేషన్లు జరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస ఎదురుకాల్పుల ఘటనల్లో నక్సల్స్‌కు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. టాప్ కమాండర్లు సహా పదుల సంఖ్యలో మావోయిస్ట్‌లు నేలకొరిగారు. ఇక మావోయిస్టులు అనే పదం వినపడకుండా చేస్తామని.. కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు ఒక కీలక సూచన చేశారు.


అడవుల్లో ఉన్న మావోయిస్ట్‌లు ఆయుధాలను వదిలేసి.. లొంగిపోవాలని కేంద్రమంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పుర్‌లో జరిగిన బస్తర్‌ ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే లొంగిపోవాలనుకునే మావోయిస్ట్‌లను కేంద్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని చెప్పారు. ఆయుధాలు వీడండి. "లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరండి.. మీ పునరావాసం బాధ్యత మాది" అని అమిత్ షా సూచించారు. అయితే అలా కాకుండా ఎప్పటిలాగే ఉంటామని.. ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తే మాత్రం.. భద్రతా బలగాలతో కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగానే బస్తర్‌ జిల్లా పరిధిలో నిత్యం జరిగే మావోయిస్ట్ కార్యకలాపాల గురించి ప్రస్తావించిన అమిత్ షా.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బస్తర్ జిల్లాలో నక్సలిజం పూర్తిగా అంతం అయిపోతే.. ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు కాశ్మీర్‌ కన్నా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే 2026 మార్చి నాటికి భారత్‌ను మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తామని అమిత్‌ షా తేల్చి చెప్పారు.


ఇక అదే సమయంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులపై అమిత్ షా కొనియాడారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి నక్సల్‌ రహిత దేశంగా మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మావోయిస్ట్‌లపై వేగంగా, కఠినంగా చర్యలు తీసుకోవడంలో తీవ్రంగా విఫలం అయిందని విమర్శించారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే నక్సల్స్‌పై చర్యలను వేగవంతం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాదిలోనే 287 మంది మావోయిస్ట్‌లను భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. దాదాపు వెయ్యిమందిని అరెస్ట్ చేసినట్లు గణాంకాలు వివరించారు. ఇక మరో 836 మంది నక్సల్స్ లొంగిపోయారని అమిత్ షా చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa