యూట్యూబ్లో వర్చువల్గా కచేరీలో పాల్గొన్న ఇరాన్ సింగర్ను హిజాబ్ ధరించలేదన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఇజ్రాయేల్ టైమ్స్ పత్రిక నివేదించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు 200 కిలోమీటర్ల దూరంలోని మజందరన్ ప్రావిన్సుల నగరం సరిలో సిగర్ పరాస్తూ అహ్మదేను శనివారం అరెస్ట్ చేశారని ఆమె తరఫు లాయర్ మిలాద్ పనహిపౌర్ తెలిపారు. ఆన్లైన్ కచేరీలో హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ గురువారం కేసు నమోదయ్యింది. స్లీవ్లెస్ దుస్తులు వేసుకుని, హిజాబ్ ధరించకుండానే నలుగురు పురుష గాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొందని ఆరోపించారు.
‘‘నేను మీ పరాస్తూ, నా గాత్రాన్ని ఇష్టపడే వ్యక్తుల కోసం పాడాలనుకునే అమ్మాయిని... ఇది నేను విస్మరించలేని హక్కు.. నేను ఎంతగానో ప్రేమించే భూమి కోసం పాడాను. ఇక్కడ, మన ప్రియమైన ఇరాన్లోని ఇక్కడ చరిత్ర, మన పురాణాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.. ఈ ఆన్లైన్ కచేరీలో నా స్వరం విని, మన అందమైన మాతృభూమిని ఊహించుకోండి’’ అని ఆమె వీడియోతో పాటు యూట్యూబ్లో పోస్ట్ చేసింది. పరాస్తూ కచేరీ వీడియోకు ఇప్పటి వరకూ 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఈ కేసులో ఆమెతో కలిసి పాడిన ఇద్దరు గాయకులు సోహేలీ ఫాఘిహ్ నసీరీ, ఎహసన్ బైరఘడర్ను కూడా అరెస్ట్ చేశారు. ఇరాన్ చట్టాల ప్రకారం.. మహిళలు హిజాబ్ దరించడం తప్పనిసరి. ఇరాన్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని చాలా మంది మతపరమైన విశ్వాసంగా భావిస్తారు. కానీ, నేటి యువతరం మాత్రం ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమేనని మండిపడుతున్నారు. రెండున్నరేళ్ల కిందటే ఇరాన్లోని ఖుర్దిస్తాన్ ప్రావిన్స్కు చెందిన 22 ఏళ్ల మహసా అమీనీ అనే యువతిని హిజాబ్ ధరించలేదని మోరల్ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆమె కస్టడీలో మరణించారు.
రాజధాని టెహ్రాన్కు వచ్చినప్పుడు హిజాబ్ నిబంధనలు పాటించలేదని, జుట్టును కప్పుకోకుండా బహిరంగ ప్రాంతాలకు రావడం, సరైన బట్టలు వేసుకోకపోవడం లాంటి చర్యలపై అదుపులోకి తీసుకున్నట్లు మొరాలిటీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అమీనీ మరణం యావత్తు ప్రపంచాన్ని కదలించింది. ఘటనను అమెరికా సహా అనేక దేశాలు ఖండించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa