ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం స్కీమ్‌తో రూ.2 లక్షలు.. ఆర్థిక శాఖ కీలక ప్రకటన.. ఏకంగా 21 కోట్ల మందికి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 10:46 PM

కేంద్ర ప్రభుత్వ పలు రకాల సంక్షేమ పథకాల అందిస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పొదుపు పథకాలతో పాటుగా తక్కువ ప్రీమియంతోనే బీమా పథకాలు అందుబాటులోకి తెచ్చింది. అందులో ఒకటే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై). ఈ స్కీమ్ ద్వారా రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీ అందిస్తోంది. అయితే, ఈ పథకానికి సంబంధించి తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 21 కోట్ల మంది చేరినట్లు తెలిపింది. వారందరికీ రూ.2 లక్షల బీమా కవరేజీ లభిస్తున్నట్లు వెల్లడించింది.


ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన గురించి శనివారం పలు విషయాలు వెల్లడించింది. ఇప్పటి వరకు పీఎంజేజేబీవై పథకంలో 21.67 కోట్ల మంది తమ పేరు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో అక్టోబర్ 20, 2024 వరకు రూ.17,211.50 కోట్లు విలువైన 8,60,575 క్లెయిమ్స్ అందినట్లు తెలిపింది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఏడాది టెన్యూర్ ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఏడాదికి ఒకసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కారణం చేత మరణం సంభవిస్తే బీమా కవరేజీ లభిస్తుంది. కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు.


ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్లలోపు వారు చేరవచ్చు. బ్యాంకులో లేదా పోస్టాఫీసులో అకౌంట్ కలిగి ఉండాలి. బ్యాంక్ ఖాతా ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. 50 ఏళ్లలోపు చేరిన వారికి 55 ఏళ్ల వయసు వచ్చే వరకు బీమా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఏ కారణంగా చేతైనా మరణిస్తే రూ.2 లక్షల బీమా సొమ్ము చెల్లిస్తారు. ఈ స్కీమ్ వార్షిక ప్రీమియం రూ.436గా కేంద్రం నిర్ణయించింది. ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది.


ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన గురించి శనివారం పలు విషయాలు వెల్లడించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. పీఎం సురక్షా బీమా యోజన కింద ఇప్పటి వరకు 48 కోట్ల మంది చేరినట్లు తెలిపింది. దీని ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ లభిస్తుందని తెలిపింది. అలాగే పీఎం జన్ ధన్ యోజనలో 54 కోట్ల మంది చేరినట్లు వెల్లడించింది. పీఎం జన్ ధన్ యోజన అకౌంట్లలో మొత్తం డిపాజిట్లు రూ.2,31,235 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఆగస్టు 15, 2024 నాటికి ఈ ఖాతాల్లో డిపాజిట్లు 15 రెట్లు పెరిగినట్లు పేర్కొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa