ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై ఖాతాలో మరో టైటిల్‌.. ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో అదరగొట్టిన జట్టు

sports |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 07:54 PM

ముంబై జట్టు మరోసారి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీని గెలుచుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో స్టార్లతో కూడిన ముంబై జట్టు బెంగళూరు వేదికగా ఆదివారం (డిసెంబర్ 15) జరిగిన ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. కెప్టెన్ రజత్‌ పటీదార్‌ రాణించడంతో మధ్యప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం ముంబై 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.


 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్‌కు రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్లిద్దరూ సింగిల్‌ డిజిట్‌కే ఔట్‌ అయ్యారు. మూడో వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్‌ పటీదార్‌ మరోసారి చెలరేగిపోయాడు. ఈ టోర్నీ ఆసాంతం సత్తాచాటిన ఈ ప్లేయర్.. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. 40 బంతుల్లో 81 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. దీంతో మధ్యప్రదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, రాయ్‌స్టన్‌ డయాస్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్‌, శివమ్‌ దూబే, సుయాంశ్‌ షేడ్గే ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు.


అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆదిలోనే పృథ్వీ షా (10) వికెట్‌‌ను కోల్పోయింది. ఈ టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న అజింక్య రహానే (30), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (16) ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ 35 బంతుల్లో 48 రన్స్ చేసి.. జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు. ఇక చివర్లో సూర్యాంశ్ షేడ్కే పెను విధ్వంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. 15 బంతుల్లో 36 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.


దేశవాళీ టోర్నీలో ఇది 63వ టైటిల్‌ కావడం గమనార్హం. ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని ముంబై గెలుచుకోవడం ఇది రెండోసారి. ఇక టోర్నీలో పరుగుల వరద పారించిన సీనియర్‌ ప్లేయర్‌ అజింక్య రహానేకు ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు దక్కింది. రహానే ఈ టోర్నీలో మొత్తంగా 469 పరుగులు చేశాడు. ఫైనల్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబైకి జట్టుకు విజయాన్ని అందించిన సూర్యాంశ్ షేడ్కేకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa