ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియా 445 ఆలౌట్.. లంచ్ సమయానికి భారత్ 22/3..

sports |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 07:53 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 405/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మరో 40 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా అత్యధికంగా ఆరు వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్ 2, నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ తలా ఓ వికెట్ పడగొట్టారు.


  కాగా గబ్బాలో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత వర్షం పడింది. ఫలితంగా మైదానమంతా చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. కాసేపటికే మిచెల్ స్టార్క్ (18)ను బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత లైయాన్ 30 బంతులు ఎదుర్కొని.. అలెక్స్ కేరీకి సహకారం అందించాడు. దీంతో దూకుడుగా ఆడిన కేరీ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు 70 పరుగులు చేసిన తర్వాత ఔట్ అయ్యాడు. అలెక్స్ కేరీ ఔట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో 117.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 445 రన్స్ స్కోరు చేసింది.


అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు మిచెల్ స్టార్క్ గట్టి షాక్ ఇచ్చాడు. తన తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే యశస్వి జైశ్వాల్ (4)ను ఔట్ చేశాడు. తాను వేసిన ఏడో బంతికి శుభ్‌మన్ గిల్ (1)ను క్యాచ్ ఔట్ చేశాడు. మిచెల్ మార్ష్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు గిల్.. పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడుతూ మరీ ఔట్ అయ్యే బలహీనతను మరోసారి ఆస్ట్రేలియా క్యాచ్ చేసుకుంది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (3) వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. భారత్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 423 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ (13) క్రీజులో ఉన్నాడు. రిషభ్ పంత్, రోహిత్ శర్మలు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే.. ఈ మ్యాచ్‌లో భారత్ పోటీలోకి వచ్చే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa