ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుకు రూ.272 కోట్ల లాటరీ.. అంతలోనే ఎంత విషాదం, ప్రాణాలే పోయాయి

international |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 09:33 PM

"అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుద్ది", "అదృష్టం మెయిన్ డోర్ తడితే.. దరిద్రం బెడ్రూం డోర్ కొట్టినట్లు".. ఇలాంటి డైలాగ్‌లు మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఈ డైలాగ్‌లు నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే రైటర్లు రాస్తూ ఉంటారు. అలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. ఏడాది పొడవునా పంటలు పండిస్తూ.. ఎండనక, వాననకా మట్టిలో ఉండే రైతుకు కళ్లు చెదిరే లాటరీ తగిలింది. ఆ రైతు కొనుగోలు చేసిన లాటరీ టికెట్.. లక్కీ డ్రాలో ఏకంగా రూ.272 కోట్లు దక్కించుకుంది. అది విన్న ఆ రైతు సంతోషం పట్టలేకపోయాడు. అయితే అదే సంతోషంతో ఆస్పత్రిపాలైన ఆ రైతు.. ఇంటికి రాకుండా అక్కడి నుంచి అక్కడే మృతి చెందాడు. బ్రెజిల్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.


లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే అందులో అదృష్టం వరించేది మాత్రం ఒక్కరినే. ఆ అదృష్టం కోసం కొంతమంది లాటరీ టికెట్లు కొనడమే ఒక పనిగా పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే అప్పుల పాలైనవారు, ఆస్తులు అమ్ముకున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే బ్రెజిల్‌కు చెందిన ఓ రైతుకు లాటరీ గెలిచిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆంటోనియో లోపేజ్ సింక్వెరా అనే రైతు.. బ్రెజిల్‌లోనే అతిపెద్ద లాటరీ అయిన మెగా-సేనలో 32 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.272 కోట్లు గెలుచుకున్నాడు. 5 కోట్ల మందిలో ఒక్కరికి దక్కే ఆ లాటరీ ఆంటోనియో లోపేజ్ సింక్వెరాని వరించింది.


  ఇక లాటరీ గెలుచుకున్న విషయం తెలియగానే.. ఆంటోనియో లోపేజ్ సింక్వెరా ఆనందంతో గాల్లో తేలిపోయాడు. వచ్చిన డబ్బులను ఏం చేయాలి అనేది అనేక ప్రణాళికలు వేసుకున్నాడు. ఇల్లు, భూములు, కారు కొనుక్కోవాలని భావించాడు. ఈ క్రమంలోనే అతడు కొన్ని రోజులుగా పంటి సమస్యతో బాధపడుతున్నాడు. ముందు ఆ పన్నుకు ఆపరేషన్ చేయించుకునేందుకు డెంటల్ హాస్పిటల్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ జరుగుతుండగానే హఠాత్తుగా ఆంటోనియో లోపేజ్ సింక్వెరా మరణించాడు. అయితే అతడికి గుండెపోటు వచ్చిందని.. అందుకే చనిపోయినట్లు డెంటల్ డాక్టర్ వెల్లడించారు.


ఇక అప్పటివరకు బాగానే ఉన్న ఆంటోనియో లోపేజ్ సింక్వెరా.. ఒక్కసారిగా గుండెపోటు వచ్చి చనిపోవడం ఏంటని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. ఆంటోనియో లోపేజ్ సింక్వెరా మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పంటి సర్జరీ చేసిన ఆస్పత్రిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.271 కోట్ల లాటరీ గెలిచిన ఆంటోనియో లోపేజ్ సింక్వెరా.. ఆ డబ్బును అనుభవించకుండానే చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa