చిన్నప్పుడు కుటుంబం నుంచి తప్పిపోవడం లేదా కిడ్నాప్నకు గురవ్వడం.. ఎవరో ఒకరు చేరదీయడం లేదా అనాథ ఆశ్రమంలో పెరిగి పెద్దైన తర్వాత తన తల్లిదండ్రులను కలుసుకోవడం ఇలాంటి సీన్లు చాలా సినిమాల్లో చూసుంటాం. నిజజీవితంలోనూ ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, ఓ మిలియనీర్ కుమారుడు.. 3 నెలల బాలుడిగా ఉన్నప్పుడు తప్పిపోయి.. అనాథలా పెరిగాడు. చివరకు 26 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. అయితే, తనకు ఆడంబరాలు వద్దని, తాను సాధారణ జీవితాన్ని గడుపుతానని తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను సున్నితంగా తిరస్కరించాడు. అచ్చం సినిమాను తలపించే ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన ఓ మిలియనీర్ దంపతుల కుమారుడు షి కిన్షువాయ్.. 26 ఏళ్ల కిందట 3 నెలల బాలుడిగా ఉన్నప్పుడు కిడ్నాప్నకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం వెతకని చోటు అంటూ లేదు. తమ కుమారుడి ఆచూకీ తెలుసుకోడానికి దాదాపు రూ. కోటి వరకు ఆ దంపతులు ఖర్చుపెట్టారు. ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించడంతో ఇటీవల అతడి జాడను తెలుసుకున్నారు. పొత్తిళ్లలో బిడ్డగా ఉన్నప్పుడు తప్పిపోయిన కొడుకు.. 25 ఏళ్ల తర్వాత తమ చెంతకు చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. 25 ఏళ్ల పాటు అనాథలా పెరిగిన తమ బిడ్డ ఇన్నాళ్లకు ఇంటికి రావడంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
ఈ క్రమంలో తమ కుమారుడి కోసం బహుళ అంతస్తుల భవనం, లగ్జరీ కారు సహా పలు కానుకలను అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ, కిన్షువాయ్ మాత్రం నిరాడంబరంగానే ఉంటానని, తాను తన భార్య ఉండటానికి ఒక ఫ్లాట్ మాత్రం ఇవ్వాలని కోరాడు. ‘ఇంత ఐశ్వర్యాన్ని అనుభవించిన తర్వాత నా కుటుంబం తమ ఆధారాన్ని కోల్పోవాలని నేను కోరుకోవడం లేదు.. నాకు ప్రేమను పంచి ఇవ్వండి చాలు’ అని సున్నితంగా తిరస్కరించాడు. అతడి నిర్ణయం కుటుంబసభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని కిన్షు కుటుంబం సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అవుతోంది. కోట్లు ఆస్తులను కాదనుకుని... సాధారణ జీవితానికే ప్రాధాన్యం ఇచ్చిన అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. డబ్బు కంటే ప్రేమ అభిమానాలనే కోరుకున్నాడని అంటున్నారు. డబ్బే ప్రధానంగా మారిపోయి మానవ సంబంధాలు అడుగంటిపోతున్న ప్రస్తుత కాలంలో నిరాడంబరంగా ఉండాలనే అతడి నిర్ణయం ఎంతో గొప్పదని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. విలువలు, సంబంధాలు, జీవితంలోని ఎత్తుపల్లాలను ఎదుర్కొని.. లదొక్కుకునే శక్తిలోనే నిజమైన సంపద ఉందని గుర్తుచేశాడని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa