ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్.. స్టెల్లా నౌకపై కలెక్టర్ కీలక వ్యాఖ్యలు.. అంటే దానర్థం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 05:54 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నప్పటికీ.. పపన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించడం.. సముద్రంలోకి వెళ్లి మరీ స్టెల్లా షిప్ తనిఖీ చేయడం.. అందులో రేషన్ బియ్యం గుర్తించడంతో సీజ్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కు సంబంధించి కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వివరాలు వెల్లడించారు.


నవంబరు 29న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్టెల్లా షిప్‌ను పరిశీలించారన్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్.. ఆ తర్వాత ఐదు విభాగాలకు చెందిన అధికారులు ఓ టీమ్‌గా ఏర్పడి స్టెల్లా షిప్‌లో తనిఖీలు చేశారన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ, పోలీస్, కస్టమ్స్, పోర్టుల అధికారులు ఈ బృందంలో ఉన్నారని కలెక్టర్ చెప్పారు. వీరంతా స్టెల్లా షిప్‌లోని 5 కంపార్టుమెంట్‌లలో 12 గంటల పాటు తనిఖీలు నిర్వహించి 12 శాంపిల్స్‌ సేకరించినట్లు చెప్పారు. స్టెల్లా షిప్‌లో 4000 టన్నుల బియ్యం ఉందన్న కలెక్టర్.. వాటిలో నుంచి 12 నమూనాలను టెస్టుల కోసం తీసుకువచ్చినట్లు చెప్పారు.


శాంపిళ్లను పరిశీలించిన తర్వాత మొదట అనుకున్న విధంగా అందులో ఉన్నది 640 టన్నుల రేషన్ బియ్యం కాదని.. అందులో మొత్తం 1,320 టన్నుల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్టు గుర్తించామని కాకినాడ కలెక్టర్ చెప్పారు. ఈ మొత్తం 1320 టన్నుల పీడీఎస్ బియ్యం సత్యం బాలాజీ రైస్‌ ఇండస్ట్రీస్‌ ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని కలెక్టర్ చెప్పారు. ఈ పీడీఎస్ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. స్టెల్లా షిప్‌లో ఉన్న 1320 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని షిప్ నుంచి అన్ లోడ్ చేయించి.. సీజ్ చేస్తామని కాకినాడ కలెక్టర్ చెప్పారు. ఈ పీడీఎస్ బియ్యాన్ని అన్ లోడ్ చేయాల్సిన బాధ్యతను సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ తీసుకోవాలన్న కలెక్టర్.. ఆ తర్వాత పోర్టు అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు వాటిని సీజ్ చేస్తారని కలెక్టర్ షాన్ మోహన్ చెప్పారు.


మరోవైపు కాకినాడ పోర్టులో ప్రస్తుతం 12 వేల టన్నుల బియ్యం లోడ్ చేయాల్సి ఉందన్న కలెక్టర్ షాన్ మోహన్.. ఆ 12 వేల టన్నుల బియ్యంలో పీడీఎస్ బియ్యం లేదని నిర్థారించిన తర్వాతే లోడింగ్‌కు పర్మిషన్ ఇస్తామని చెప్పారు. 1320 టన్నుల పీడీఎస్ బియ్యం అన్ లోడ్ చేసేందుకు రెండు రోజులు పట్టొచ్చన్న కలెక్టర్.. అది పూర్తైన తర్వాత మిగిలిన బియ్యాన్ని షిప్‌లోకి లోడింగ్ చేస్తామన్నారు. ఆ తర్వాత షిప్‌ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కలెక్టర్ చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు స్టెల్లా షిప్ సీజ్ చేయడం ఉంటుందా.. ఉండదా అనేది ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa