ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరుని స్మార్ట్‌గా అభివృద్ధి చేద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 07:36 PM

చిత్తూరు నగర అభివృద్ధిని కోరుకునేవారంతా రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనతోనే ఆ అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని గ్రహించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ స్పష్టం చేశారు. చిత్తూరు నగరాన్ని స్మార్ట్‌గా అభివృద్ధి చేయడం, రోడ్ల విస్తరణ అంశాలపై సోమవారం సాయంత్రం నాగయ్య కళాక్షేత్రంలో ప్రజా సంఘాలు, నగర అభివృద్ధి కమిటీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు, విద్యార్థులు మాట్లాడుతూ.. నగరాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయాలని కోరారు. యూనివర్శిటీని నెలకొల్పడం ద్వారా విద్యావకాశాలు మెరుగుపడతాయని సూచించారు. వైద్య రంగం, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, ఐటీ కంపెనీల ఏర్పాటు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుపై వివిధ సంఘాల నేతలు, రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను తెలిపారు.సంతపేటవాసులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే సత్యప్రభ బలవంతంగా మా ప్రాంత రోడ్లను విస్తరింపజేశారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు తాము అడ్డుకున్నామని, అయితే రోడ్లను విస్తరించాక తమ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందన్నారు.తమ ఆస్తుల కూడా విలువ పెరిగిందన్నారు.తాము అప్పట్లో పరిహారం కూడా అడగలేదన్నారు.అనంతరం ఎమ్మెల్యే జగన్మోహన్‌ మాట్లాడుతూ.. ‘చిత్తూరులో రోడ్ల విస్తరణ అంశం గత పదేళ్లుగా నానుతోంది. రోడ్లు అభివృద్ధి చెందితేనే నగరం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి సహకరించాలి. ప్రధానంగా హైరోడ్డు విస్తరణ అంశంలో కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. అయినా ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. హైరోడ్డు విస్తరణకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి నాకు తెలియజేస్తే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నష్టపోయే వారికి తగిన విధంగా న్యాయం చేస్తాం. విస్తరణను అడ్డుకునే 200మంది వైపు కాకుండా, అభివృద్ధిని కాంక్షించే 2 లక్షల మంది వైపే నేనుంటాను. చెన్నై- బెంగళూరు నగరాల మధ్య ఉన్న చిత్తూరు అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలున్నాయి.అందరూ కలిసికట్టుగా నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ముందుకు రావాలి. మురకంబట్టు నుంచి కలెక్టరేట్‌ వరకు, ఇరువారం నుంచి పుత్తూరు రోడ్డు వరకు రోడ్లను విస్తరించుకోవడం ద్వారా నగరాన్ని వేగంగా అభివృద్ధి వైపు నడపగలం. నగరాభివృద్ధి కోసం స్మార్ట్‌ డెవల్‌పమెంట్‌ కమిటీని ఏర్పాటు చేసి మూడు నెలలకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. అభివృద్ధి కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లతో కలిసి ముందుకు సాగుతాం. అమరావతి స్ఫూర్తితోనే చిత్తూరు ప్రజలు నగరాభివృద్ధి కోసం స్వచ్ఛంధంగా ముందుకురావాలి’ అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మేయర్‌ అముద, డిప్యూటీ మేయర్‌ రాజే్‌షకుమార్‌ రెడ్డి, చుడా ఛైౖర్‌ పర్సన్‌ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాద్‌, ప్రముఖులు డీకే బద్రినారాయణ, రావూరి ఈశ్వరరావు, సురేంద్రకుమార్‌, చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు, సప్తగిరి ప్రసాద్‌, గంటా మోహన్‌, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ ప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, ట్రేడ్‌ యూనియన్‌ నేతలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa