మనం ఏదైనా రెస్టారెంట్కు వెళ్తే.. అక్కడ మెనూ కార్డులు, హ్యాపీ కొటేషన్స్తో ఉన్న ఫొటోలు, బిల్లులు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లారంటే మాత్రం వాళ్ల మనసులోని భావాన్ని కూడా మనం చదవవచ్చు. మరీ ముఖ్యంగా ఇటీవలే బెంగళూరు టెక్కీ ఆత్మహత్య చేసుకోవడంపై వారు ఏమనుకుంటున్నారో ప్రత్యేకించి తెలుసుకోవచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్... భార్య, అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ముఖ్యంగా 24 పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ చనిపోగా.. అందులో భార్య తనను ఎలా వేధించిందో వివరించాడు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వైవాహిక చట్టాలను ఆమె ఎలా దుర్వినియోగం చేసిందో కూడా వెల్లడించాడు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న భార్య బాధితులు.. ఆయనకు మద్దతు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూనే.. ఆయన భార్య, అత్త, మామలకు కఠినంగా శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.
గత ఐదు రోజులుగా హాట్ టాపిక్గా మారిన ఈ విషయంపై ఢిల్లీ రెస్టారెంట్ తమదైన స్టైల్లో స్పందించింది. ముఖ్యంగా జంబోకింగ్ అనే రెస్టారెంట్.. టెక్కీ అతుల్ సుభాష్ మృతికి వినూత్నంగా నివాళి అందించింది. అయితే హౌజ్ఖాస్ అనే గ్రామంలోని జంబోకింగ్ ఫ్రాంచైజీకి వెళ్లిన ఓ వ్యక్తి.. తనకు నచ్చిన భోజనం ఆర్డర్ చేసుకున్నాడు. హాయిగా కూర్చుని కడుపు నిండా తిన్నాడు. ఆపై బిల్లు తీసుకురమ్మని చెప్పాడు. అయితే సర్వర్ తెచ్చిన బిల్లు చూసిన కస్టమర్ షాక్ అయ్యాడు.
షాక్ అయ్యాడు అనగానే బిల్లు ఎక్కువగా వచ్చిందేమో అని అనుకోకండి. ఆయన షాక్ అయింది బిల్లు చూసి కాదు.. దానికి కింద ఉన్న మెసేజ్ చూసి. ఆ మెసేజ్లో హోటల్ యాజమాన్యం మనసులో అతుల్ సుభాష్ గురించి ఏమనుకుంటున్నారో రాసి ఉంది. ముఖ్యంగా "బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్యకు మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అతని జీవితం అందరిలాగే ఆయనకు చాలా ముఖ్యమైంది. ఇప్పటికైనా మీకు ప్రశాంతత దొరుకుతుందని కోరుకుంటున్నాం" అని చెప్పారు.
బిల్లు చివరన ఉన్న ఈ మెసేజ్ చదివిన కస్టమర్... హోటల్ యజమాని వద్దకు వెళ్లి దీని గురించి అడిగాడు. అయితే ఆయన తాము అతుల్ సుభాష్కు నివాళులు, మద్దతు తెలపడంతో పాటు అందరికీ అవగాహన కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారని వివరించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. అలాగే బిల్లుకు సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూ.. రెస్టారెంట్ వినూత్న నివాళిపై కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొందరు.. నిజంగానే బాధతో వాళ్లిలా చేస్తున్నారని మరికొందరు రాసుకొస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa