గొలుగొండ, కృష్ణాదేవిపేట పోలీసులు గురువారం పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. ఒడిశా నుంచి గొలుగొండ మండలం మీదుగా మైదాన ప్రాంతానికి రవాణా చేస్తున్న 450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్రావు గొలుగొండ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా గొలుగొండ మండలం వైపు పెద్ద మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో మండలంలోని చిన్నయ్యపాలెం గ్రామం వద్ద గొలుగొండ ఎస్ఐ రామారావు, కృష్ణాదేవిపేట ఎస్ఐ తారకేశ్వరరావు, పోలీసు సిబ్బంది గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కృష్ణాదేవిపేట వైపు నుంచి వస్తున్న ఐషర్ వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. ఇందులో వున్న ఇద్దరు వ్యక్తులతోపాటు గంజాయితో సహా వ్యాన్ను పోలీసు స్టేషన్కు తరలించారు. గంజాయిని తూకం వేసి 450 కిలోలు వున్నట్టు నిర్ధారించారు. నిందితులు ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన రాజేశ్శర్మ, కిల్లో మహదేవ్లుగా గుర్తించి అరెస్టు చేశారు. గంజాయిని ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతం నుంచి విశాఖపట్నం తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారని డీఎస్పీ వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ, కృష్ణాదేవిపేట ఎస్ఐలు రామారావు, తారకేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa