సాధారణంగా విమానాల్లో ప్రయాణికులకు మద్యం అందిస్తారు. అయితే ఈ విమానం ఎక్కిన వారు మొత్తం ఎంత కరువులో ఉన్నారో ఏమో. విమానం గాల్లోకి ఎగిరిన 4 గంటల్లోనే.. అందులో ఉన్న మొత్తం మందు బాటిళ్లను ఖాళీ చేసేశారు. ఈ మందుబాబులు చేసిన పనికి.. ఆ విమాన సిబ్బంది.. విమానంలో మద్యం అయిపోయిందని ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. మందుబాబుల ధాటికి రూ.1.8 లక్షల మద్యం అయిపోయినట్లు విమాన సిబ్బంది తెలిపారు. గుజరాత్లోని సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కు శుక్రవారం వెళ్లిన ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సూరత్ నుంచి బ్యాంకాక్కు తొలి విమానాన్ని ఎయిర్ ఇండియా సంస్థ.. శుక్రవారం ప్రారంభించింది. ఈ విమానం పూర్తిగా బుక్ కాగా.. అందులో బ్యాంకాక్కు వెళ్లిన ప్రయాణికులు.. తమ అనుభవాలను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలే కాకుండా ఆ విమానంలో జరిగిన మరో విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఎందుకంటే ఆ విమానంలో ఉన్న మద్యం మొత్తం.. అది ల్యాండ్ కావడానికి ముందే ఖాళీ కావడం చర్చకు దారితీస్తోంది.
ఇక ఆ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు దాదాపు 15 లీటర్ల ఖరీదైన మద్యం అయిపోయినట్లు సిబ్బంది తెలిపారు. అందులో చివాస్ రైగల్, బకార్డీ, బీర్ వంటి డ్రింక్స్ కలిపి మొత్తం రూ. 1.8 లక్షల విలువైన మద్యం ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఎక్కువగా మద్యం సేవించడం వల్ల బ్యాంకాక్కు చేరుకోకముందే పూర్తిగా మద్యం అయిపోయిందని విమానంలో అనౌన్స్మెంట్ చేశారు. అయితే గుజరాత్లో మద్య నిషేధం అమలు అవుతుండగా.. ఇక ఒక్కసారిగా విమానంలో మద్యం దొరకడంతో మందుబాబులు తమ దాహాన్ని తీర్చుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఆ విమానంలో ప్రయాణికుల కోసం గుజరాతీ వంటకాలు అందించారు. ముఖ్యంగా థెప్లా, ఖమన్ వంటి పదార్థాలతోపాటు పిజ్జా సహా ఇతర వంటకాలు కూడా అందుబాటులో ఉంచారు. మొత్తంగా 4 గంటల ప్రయాణంలో విమానంలో మద్యం, వంటకాలు పూర్తిగా అయిపోయినట్లు విమాన సిబ్బంది తెలిపారు. దీంతో ఇప్పుడు గుజరాత్లో అమలు చేస్తున్న మద్య నిషేధ విధానంపై కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఘటన గుజరాత్ ప్రజలు మద్యం సేవించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టం అవుతోందని పేర్కొన్న ఓ నెటిజన్.. గుజరాత్లో మద్య నిషేధం విధానంపై మరోసారి ఆలోచించాలని కోరారు. కంట్రోల్గా మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రావడాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమని పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa