ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. నూతన సంవత్సరం సందర్భంగా బహుమతి అందజేశారు. శనివారం సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన రఘురామకృష్ణరాజు న్యూఇయర్ గిఫ్ట్ అందించారు. 2025 సంవత్సరం క్యాలెండర్ను సీఎంకు బహుమతిగా అందించారు. ఈ టేబుల్ క్యాలెండర్ను రఘురామకృష్ణరాజు కుమార్తె స్వయంగా తయారు చేయడం విశేషం. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఒక్కో పేజీలో ఒక్కో అంశం గురించి డ్రాయింగ్ గీసీ.. మొత్తం 12 పేజీల ఈ క్యాలెండర్ తయారు చేసినట్లు రఘురామ పేర్కొన్నారు. ఈ క్యాలెండర్లోని ప్రతీ పేజి తన కుమార్తె సృజనాత్మకతను, కృషిని ప్రతిబింబిస్తుందని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
మరోవైపు చంద్రబాబు నాయుడుతో రఘురామకృష్ణరాజుకు ఎంతటి సాన్నిహిత్యం ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు విపక్షంలో ఉన్న సమయంలో రఘురామ వైసీపీ ఎంపీగా ఉన్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ.. ప్రజాసమస్యలపై రఘురామకృష్ణరాజు నిత్యం పోరాటం చేశారు. ఈ క్రమంలోనే అరెస్ట్ కూడా అయిన పరిస్థితి. రఘురామ పోరాటాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు.. రఘురామకృష్ణరాజును ఎన్నికలకు ముందు టీడీపీలో చేర్చుకున్నారు. ఉండి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అప్పటికే ఆ సీటు రామరాజుకు కేటాయించగా.. ఆయనకు నచ్చజెప్పి మరీ రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు ఇచ్చారు. ఇక అధినేత అంచనాలను నిజం చేస్తూ రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
అనంతరం ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టింది. రఘురామకృష్ణరాజుకు మంత్రిపదవి దక్కుతుందనే వార్తలు వచ్చాయి. అయితే కూటమి భాగస్వామ్యం, సామాజిక సమీకరణాల కారణంగా రఘురామకు మంత్రిపదవి అవకాశం దక్కలేదు. అయినప్పటికీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు అవకాశం కల్పించారు. కేబినెట్ హోదా కల్పించారు. ఆ రకంగా రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు నాయుడు సముచిత స్థానం కల్పించారు. అటు రఘురామకృష్ణరాజు కూడా చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మంచిపేరు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం చంద్రబాబును కలిసిన రఘురామ.. న్యూ ఇయర్ క్యాలెండర్ అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa